హైదరాబాద్లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఏఆర్ వంశీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో వివాహానికి అంగీకరించారు. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిశ్చితార్థం అనంతరం వంశీ తన వద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. అంతేకాకుండా పెళ్లికి ముందుగానే కట్నం చెల్లించాలని తన కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. ఈ పరిణామాలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత వంశీ తనను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. తాను డ్రగ్స్కు బానిసనంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, ఆరోపణలు చేశాడని తెలిపింది. ఇదే సమయంలో తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని మహిళ పోలీసులకు వివరించింది.
ఇవి కూడా చదవండి
ఈ వేధింపులు, బెదిరింపుల కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు పేర్కొంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఎస్హెచ్ఓ ఎస్జీ శివశంకర్ తెలిపారు. సోషల్ మీడియా పోస్టులు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..