ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామని తెలిపారు. దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని, దేశ ప్రజలంతా పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ లక్ష్యం – పేదరిక నిర్మూలన
దృఢ సంకల్పంతో ముందుకెళ్లి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా నిలవాలన్నదే మన లక్ష్యమని ప్రధాని అన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ‘ఆత్మనిర్భర్ భారత్’గా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ ఉత్పత్తులు, ‘వోకల్ ఫర్ లోకల్’ విధానాలను దేశ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని కొనియాడారు.
పారిశ్రామిక, ఇంధన రంగాల్లో ముందడుగు
దేశంలో సెమీకండక్టర్ ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయని ప్రధాని తెలిపారు. డిజిటల్, క్రిటికల్ మినరల్స్పై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే అనేక దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. భారత్ న్యూక్లియర్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని, త్వరలోనే 5 కొత్త న్యూక్లియర్ ప్లాంట్లు రాబోతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే ‘సముద్ర మంథన్’ ద్వారా కొత్త ఆవిష్కరణలు చేపట్టామని, 1.75 కోట్ల ఇళ్లకు గ్యాస్ పైప్లైన్, 50 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, హైడ్రోజన్ రైళ్లు కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని వివరించారు.
స్వయం సమృద్ధి – అడ్డంకుల అధిగమనం
భారత ప్రజలను భయపెట్టి ఆనందించాలని కొందరు చూశారని మోదీ విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత వస్తుందంటూ అసత్యాలు ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నామని స్పష్టం చేశారు. భారత్ తన అంతర్గత సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుని నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.