కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు, పావు కప్పు పచ్చి శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు జొన్న రవ్వ, రెండు నుండి మూడు పచ్చిమిర్చి తరుగు, రెండు స్పూన్ల సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, పావు కప్పు సన్నగా తరిగిన సోయకూర, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పావు స్పూన్ ఇంగువ మరియు రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వేసి బాగా కడిగి, నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో పావు కప్పు జొన్న రవ్వను కడిగి గంటపాటు నానబెట్టాలి. జొన్న రవ్వ వేయడం వల్ల ఈ ఉండలు తినేటప్పుడు జిగురుగా నోటికి అంటుకోకుండా పొడిపొడిగా ఎంతో రుచిగా వస్తాయి. జొన్న రవ్వ లేకపోతే బియ్యం రవ్వను కూడా వాడుకోవచ్చు.
నానిన పప్పులన్నింటినీ నీళ్లు ఏమాత్రం లేకుండా వడకట్టి, పచ్చిమిర్చి ముక్కలతో కలిపి మిక్సీ జార్లో వేయాలి. పల్స్ మోడ్లో మరీ మెత్తగా కాకుండా బరకగా (కోర్స్గా) గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో నానబెట్టిన జొన్న రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండి వేయాలి.
ఆపై సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ మరియు సన్నగా తరిగిన సోయకూర వేయాలి. సోయకూర అద్భుతమైన సువాసనతో పాటు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇది లేకపోతే పాలకూర లేదా మెంతికూర వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతటినీ బాగా కలిపి, గట్టిగా నొక్కకుండా చేత్తో తేలికగా రోల్ చేస్తూ ఓవల్ షేప్ ఉండల్లా చేసుకోవాలి.
స్టవ్ మీద స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. చిల్లుల గిన్నెపై అరటి ఆకు లేదా నెయ్యి రాసి, తయారుచేసిన ఉండలను పేర్చాలి. మూతపెట్టి మీడియం మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. టూత్పిక్తో గుచ్చి చూసి అంటుకోకుండా వస్తే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో బలవర్ధకమైన నుచ్చినఉండే సిద్ధం! పైన కాస్త నెయ్యి వేసుకుని కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో తింటే రెండు, మూడు ఉండలకే కడుపు నిండి రోజంతా ఎనర్జీగా ఉంటారు!




