దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలిశాయని పురాణాల్లో తెలిపారు. ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని వదించిన తర్వత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవతలు, ప్రహ్లాదున్ని స్వామిని శాంత పరచడం నీవల్లే అవుతుందని చెప్తారు.
అప్పుడు ప్రహ్లాదుడు ఈ కద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేసాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రి వృక్షం క్రింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
ఇక్కడ స్వామి వారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్షంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహాస్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారంటే. కదిరికి దగ్గరలో కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది.
అలాగే ఖాద్రి అని ఎందుకంటారంటే.. సంస్కృతంలో ఖా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఖాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.
ఇక్కడ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. పూరి జగన్నాథ రథోత్సవం తరువాత కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం పెద్దదిగా చెబుతారు. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఈ దేవాలయానికి హిందువులు కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి మాడవీధుల్లో తిరుగుతుండగా… మాడ వీధులు ఇరుకుగా ఉండటం వల్ల ప్రభుత్వం రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది.




