పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నారాయణరావు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం క్రితం పెళ్లి జరిగింది. అయితే శనివారం బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి వేడుక ఉండడంతో నారాయణ తన స్నేహితుడితో కలిసి పొందూరు మండలం రాపాక గ్రామానికి కొత్త బైక్పై వెళ్లాడు. పెళ్లి ముగిసిన తర్వాత ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా.. కొత్త బండికి సంబంధించిన పేపర్లు తీసుకెళ్దామని శ్రీకాకుళంలోని బైక్ షోరూంకు వెళ్లారు.
అక్కడ షోరూంలో డాక్యుమెంట్లు తీసుకొని ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న బైక్ పొందూరు మండలం సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్పై వెనుక కూర్చున్న అతని స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన కేవలం వారం రోజులకే భర్త చనిపోవడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతాడనుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి అతని తల్లిదండ్రులు సైతం గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.