Headlines

అమెరికాకు భారీ నష్టం.. జలాంతర్గామిని స్వాధీనం చేసుకున్న ఇరాన్ సైన్యం.. | Middle East Tensions Escalate: Israeli Strikes and Irans US Sub Seizure


మార్చి నెలలో టెహ్రాన్‌లో మూడు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు యుద్ధ నేరాల కిందకు వస్తాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా తెలిపింది. ఈ దాడులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. మార్చి 1 నుండి 13 మధ్య నిలోఫర్, రెసాలత్, జవాదియే ప్రాంతాలపై జరిగిన దాడుల్లో కనీసం 41 మంది పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘం తెలిపింది. ఈ దాడులతో ఇళ్లు, వ్యాపారాలు, ఇతర పౌర భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. జనాభా ఎక్కువగా ప్రాంతాలలో విస్తృత ప్రాంత ప్రభావం చూపే పేలుడు ఆయుధాలను ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో ఆధారాలు లభించాయని తెలిపింది. పోలీస్ స్టేషన్లు, ఐఆర్‌జిసి బసిజ్ బెటాలియన్‌కు చెందిన ఒక సదుపాయం కూడా లక్ష్యాలలో ఉన్నాయని స్పష్టం చేసింది.

16 మంది పౌరులు మృతి

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇటువంటి ప్రదేశాలు సైనిక లక్ష్యాలుగా పరిగణించబడినప్పటికీ.. సమీపంలోని పౌర ప్రాంతాలకు జరిగిన నష్టం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆమ్నెస్టీ పేర్కొంది. రెస్అలత్‌లో జరిగిన దాడుల్లో బసిజ్ సదుపాయం, కనీసం ఒక నివాస గృహంతో సహా సమీపంలోని మూడు భవనాలు దెబ్బతినడంతో 16 మంది పౌరులు మరణించారని తెలిపింది. నిలోఫర్, జవాదియేలలో జరిగిన దాడుల్లో కనీసం మరో 25 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.

అమెరికా రియాక్షన్ ఇదే..

అటు హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా సైన్యానికి చెందిన అత్యంత ఆధునిక, స్మార్ట్ మానవరహిత జలాంతర్గాములలో ఒకదానిని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ నౌకాదళం ప్రకటించింది. డైవ్-ఎల్‌డిగా పిలిచే ఈ మానవరహిత జలాంతర్గామిని నిఘా ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక జలాంతర్గామి అని, వాహన సాంకేతికతతో కూడి ఉందని తెలిపింది. వాయు రక్షణ వ్యవస్థలు ఒక MQ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీనిపై అమెరికా సైన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రాంతీయ జలాల సర్వే సందర్భంగా ఒక రోజు క్రితం తమ జలాంతర్గామి డ్రోన్‌లలో ఒకటి పనిచేయడం ఆగిపోయిందని తెలిపింది. కానీ ఇది ఇరాన్ స్వాధీనం చేసుకున్న పరికరం అదేనా కాదా అనే విషయాన్ని మాత్రం అమెరిక వెల్లడించలేదు. అయితే నావికులను ప్రమాదంలో పడకుండా నిఘా సమాచారాన్ని సేకరించడానికి, శత్రు నౌకలు, జలాంతర్గాములను పసిగట్టడానికి అమెరికా సైన్యం జలాంతర్గామి నావికా వ్యవస్థలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే  డైవ్-ఎల్‌డి బేస్‌కు తిరిగి రాకుండా 10 రోజుల వరకు పనిచేయగలదు. 6 వేల మీటర్ల లోతు వరకు డైవ్ చేయడానికి దీనిని రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *