వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే జోర్డాన్ సైన్యం తమ గగనతలంలోకి ప్రవేశించిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. పౌరులు లేదా ఆస్తులకు ముప్పు కలగకముందే వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖార్గ్ ద్వీపంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖార్గ్ ద్వీపం “పూర్తిగా ధ్వంసమైంది” అంటూ సోషల్ మీడియాలో ఓ యానిమేటెడ్ వీడియోను పోస్టు చేశారు. అయితే ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసమైందన్న ట్రంప్ వాదనకు ఇప్పటివరకు స్వతంత్ర ధృవీకరించలేదు.
Trump On Kharg Island
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. తాజా దాడులు ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ చమురు సరఫరాలపై కూడా ఆందోళన పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఈ తాజా ప్రతీకార దాడులు విస్తృత ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..