
తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ చేకూరేది. కొడుకుగా పద్మనాభం వంటి నటులుంటే చెప్పనక్కర్లేదు, ఆ సన్నివేశాలు పండే తీరే వేరు.
రచయితలు సూర్యకాంతం గారి కోసమే కొత్త గయ్యాలితనాలను అన్వేషించి మరీ సంభాషణలు రాసేవారు. దర్శకులు కేవలం సన్నివేశాన్ని వివరించి, అమ్మా, మీకు చెప్పేది ఏముంది? కొంచెం మసాలా వేసి ఘుమాయించండి అని చెప్పేవారట. సూర్యకాంతం గారు వారి అంచనాలకు మించి, వాళ్ళెవ్వరూ ఊహించని విధంగా సన్నివేశాలను పండించేవారు. ఆమె గొప్పదనం కేవలం నటనలో మాత్రమే కాదు, వృత్తిపరమైన క్రమశిక్షణలో కూడా. షాట్ను మొదటి టేక్లోనే ఓకే చేయించుకునే అతి కొద్ది మంది ఆర్టిస్టులలో సూర్యకాంతం గారు మొదటి వరుసలో ఉండేవారు. ఆమె ప్రత్యేక శైలి, నటనలోని సహజత్వం, పాత్రలకు ప్రాణం పోసిన తీరు తెలుగు సినిమాకు ఒక అపురూపమైన వారసత్వాన్ని అందించాయి.
సినిమాల్లో కోడళ్లను వేధించే క్రూరమైన అత్తగా కనిపించినా, నిజ జీవితంలో ఆమె ఎంతో సున్నిత మనస్కురాలు. షూటింగ్ సెట్స్కు తన ఇంటి నుంచే స్వయంగా రకరకాల వంటలు వండి తీసుకువచ్చి, తోటి నటీనటులకు, చిత్ర యూనిట్ సభ్యులకు కొసరి కొసరి వడ్డించేవారు. అందుకే ఆమెను చిత్ర పరిశ్రమలో “అన్నపూర్ణ” అని పిలిచేవారు .
కెరీర్ ప్రారంభంలో ఆమె ఎంతో అందంగా ఉండి, హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నించారు. కానీ ఒక కారు ప్రమాదంలో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. ఆ తర్వాతే ఆమె ‘సంసారం’ (1950) చిత్రంలో అత్త పాత్ర పోషించి, ఆపై గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. మహానటి సూర్యకాంతం గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలో ఉన్న వెంకట కృష్ణరాయపురం.