విజయ్ సర్కార్కు మద్రాస్ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాలకు నైపుణ్యత , స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే.. అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని.. దాన్ని కష్టపడి సాధించాలని పేర్కొంది.
అసలు ఏం జరిగింది!
గతేడాది సెప్టెంబర్లో జరిగిన TVK ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి కరూర్ వెళ్లి అర్హతలున్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై పై అన్నాడీఎంకే నేత ఆర్.బి. ఉదయ్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన విధానాలను పక్కనపెట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, ప్రభుత్వం ఏ ఉద్యోగ నియమాక ప్రక్రియ చేపట్టినా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేపట్టాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టి న్యాయస్థానం సీఎం విజయ్ చేపట్టిన ఈ నియామకాలు చెల్లబోవని తీర్పునిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,