Headlines

తొలుత 175 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్లు.. లంకను దహనం చేసిన టీమిండియా తోపు | Ravindra jadeja return ind vs sl test series mohali records

తొలుత 175 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్లు.. లంకను దహనం చేసిన టీమిండియా తోపు | Ravindra jadeja return ind vs sl test series mohali records


IND vs SL Test Series: శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టులో అతడు చేరడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే లంక జట్టుపై మొహాలీ వేదికగా జడేజా సృష్టించిన ఆల్ రౌండ్ విధ్వంసకాండ ఇప్పటికీ క్రీడాభిమానుల కళ్లముందే మెదులుతోంది.

బ్యాట్‌తో సునామీ.. లంక బౌలర్లకు చుక్కలు..

2022లో శ్రీలంకతో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఒక దశలో 228 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా.. రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పంత్ తనదైన శైలిలో చెలరేగగా, జడ్డూ అతనికి అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. పంత్ అవుటైన తర్వాత జడేజా గేర్ మార్చాడు. టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా టీ20లా మార్చేశాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 160 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విరుచుకుపడి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడ్డూ దెబ్బకు లంక బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

ఇవి కూడా చదవండి



బంతితోనూ మాయ.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు..

బ్యాట్‌తో లంకను వణికించిన జడేజా.. బంతి చేతికి తీసుకున్నాక తనలోని అసలైన స్పిన్ మాంత్రికుడిని బయటకు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే భారీ షాక్ ఇచ్చాడు. ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నను 28 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కాసేపు విరామం తీసుకున్న ఈ స్టార్ స్పిన్నర్.. 61వ ఓవర్లో మళ్లీ విజృంభించాడు. సురంగ లక్మల్‌ను డకౌట్ చేసి, ఆ వెంటనే లసిత్ ఎంబుల్దెనియాను బుట్టలో వేసుకున్నాడు. ఇక 67వ ఓవర్లో విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమారాలను వరుస బంతుల్లో అవుట్ చేసి లంక పతనాన్ని శాసించాడు. కేవలం 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది.

ఫాలో ఆన్‌లోనూ వదలని జడ్డూ..

తొలి ఇన్నింగ్స్‌లో ఘోర వైఫల్యంతో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసారైనా పుంజుకుందామనుకున్న లంక ఆశలపై జడేజా మరోసారి నీళ్లు చల్లాడు. ధనంజయ డిసిల్వాను అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు. ఆ తర్వాత కుదురుకుంటున్న ఏంజెలో మాథ్యూస్‌ను 28 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే సురంగ లక్మల్‌ను మరోసారి డకౌట్ చేశాడు. చివర్లో ఎంబుల్దెనియా వికెట్ తీసి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్‌తో 175 పరుగులు, బంతితో ఏకంగా 9 వికెట్లు పడగొట్టి మొహాలీ టెస్టును వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

మళ్లీ వస్తున్నాడు.. లంకకు ఇక కష్టాలే!

దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో భారత జట్టు ఇప్పుడు సరికొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇలాంటి కీలక సమయంలో సీనియర్ల అనుభవం జట్టుకు ఎంతో అవసరం. గత కొంతకాలంగా మైదానానికి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా.. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో జడేజా చేరడం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు కొండంత అండ. గతం నుంచీ శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉన్న జడేజా.. ఈసారి కూడా అదే స్థాయిలో చెలరేగుతాడని క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *