ముఖ్యంగా ఈ అట్లను నానేయడం లేదా రుబ్బడం వంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ బెల్లం అట్ల తయారీ విధానం చాలా తేలికైనది. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు వరిపిండి, ఒక కప్పు గోధుమపిండి తీసుకోండి. అందులోనే అర కప్పు తురిమిన బెల్లం పొడి వేయాలి.
దీనికి తోడు మంచి సువాసన కోసం ముప్పావు టీస్పూన్ యలకల పొడి, అలాగే కమ్మటి ఘాటు కోసం ఒక టీస్పూన్ సొంటి పొడి జత చేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ బెల్లం పూర్తిగా కరిగే వరకు, అట్ల పిండి మాదిరిగా జారుగా కలుపుకోవాలి. బెల్లం గడ్డలుగా ఉంటే నీళ్లలో కరిగించి వడకట్టి కూడా పిండిలో వేసుకోవచ్చు.
పిండి బాగా కలిసాక రెండు చిటికెల వంటసోడా, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేయాలి. పెనాన్ని నెయ్యితో బాగా తుడిచి, గరిటెడు పిండి వేసి పల్చగా అట్లు పోసుకోవాలి. ఈ అట్లకు నూనె కంటే నెయ్యిని వాడితేనే అసలైన కమ్మటి రుచి వస్తుంది.
నెయ్యి వేసి రెండు వైపులా దోరగా, ఎర్రగా కాల్చుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఈ అట్లు మంచి ఎరుపు రంగులోకి వస్తాయి. అలాగే ఇందులో వేసిన సొంటి పొడి ఘాటు అక్కడక్కడా తగులుతూ అట్లకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఒకవేళ సొంటి పొడి ఘాటు నచ్చకపోతే దానిని తీసేయవచ్చు. ఈ కమ్మటి బెల్లం అట్లు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో మృదువుగా, రుచిగా ఉంటాయి.
వీటిని అల్లం పచ్చడి లేదా కారం తక్కువగా ఉండే కొబ్బరి పచ్చడితో నంజుకుని తింటే ఆ రుచి వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ తీపి అట్లు ఎంతగానో నచ్చుతాయి, మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరి తింటారు. పైగా ఉడిపి ప్రాంతంలో శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే ఈ పవిత్రమైన సాంప్రదాయ వంటకాన్ని మీ ఇంట్లో కూడా అప్పటికప్పుడు తయారుచేసి, మీ కుటుంబ సభ్యులకు అందించి ఆ పాతకాలపు మధురమైన రుచులను ఆస్వాదించండి.




