రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే పేద ప్రజలకు బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500లకు పైగా రైస్ మిల్ కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన కూడా చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆదరణను బట్టి త్వరలోనే బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె సహా ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరకే అందించేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.
విజయవాడలోని రైతు బజార్ కేంద్రంగా తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం విక్రయాన్ని ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, రైస్ మిల్ కౌంటర్లలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల్లో రూ.52 కే బీపీటీ స్టీమ్ రైస్ను అందించనున్నారు. సాధారణంగా అయితే ఈ బియ్యాన్ని రూ.65 వరకు అమ్మతారు. అలాగే రూ.58కి దొరికే బీపీటీ బియ్యాన్ని ఈ కౌంటర్లలో కేవలం రూ.50కి మాత్రమే అందించనున్నారు.
అయితే ఈ కార్యక్రమం కింద ఒక్క ఫ్యామిలీలోని ఒక్కో వ్యక్తికి 10 కేజీల చొప్పున బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు నాణ్యమైన బియ్యం కూడా దొరుకుతాయి. అలాగే త్వరలో పప్పు, నూనెను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తే.. ఇది పేద ప్రజలకు నెలవారీ ఖర్చులను మరింత తగ్గించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.