Headlines

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India


దేశవ్యాప్తంగా రుతుపవనాలు మరింత చురుకుగా మారడంతో అనేక రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీటి ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రస్తుతం అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర భారతదేశంలో రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల 24 గంటల వ్యవధిలో పలుచోట్ల మేఘ విస్ఫోటనాలు సంభవించి ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒడిశా, సిక్కిం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, తీర కర్ణాటక, అంతర్గత కర్ణాటకలో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా వర్షపాతం పెరగనుంది.

రుతుపవనాల చురుకుదలకు ప్రధాన కారణంగా రుతుపవన ద్రోణి, పలు వాతావరణ ఆవర్తనాలు పనిచేస్తున్నాయని ఐఎండీ వివరించింది. అనూప్‌గఢ్ నుంచి ఢిల్లీ, షాజహాన్‌పూర్, బస్తీ మీదుగా నాగాలాండ్ వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, కర్ణాటక ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ వ్యవస్థలు తేమను అందిస్తూ వర్షాలకు కారణమవుతున్నాయి.

ప్రకృతి వైపరీత్యాల జాబితాలో మార్పులు..!

ఇదిలా ఉండగా, వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్ర వాతావరణ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగాలులు, పిడుగుపాటును కూడా నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. దీంతో ప్రభావిత రాష్ట్రాలు SDRF, NDRF నిధుల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం లభించనుంది.

2026 మార్చి 1 నుంచి జూలై 26 వరకు దేశంలో 4,853 వడదెబ్బ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇదే సమయంలో 20 మంది వడదెబ్బ కారణంగా మరణించినట్లు వెల్లడించింది. తెలంగాణలో అత్యధికంగా 915 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 733, ఛత్తీస్‌గఢ్‌లో 660 కేసులు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో వడగాలులు, పిడుగుపాటును విపత్తుల జాబితాలో చేర్చడం కీలక విధాన మార్పు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యలకు కేంద్ర మద్దతు అందే అవకాశం పెరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *