IND vs SL : భారత క్రికెట్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు చేరుకుంది. మంగళవారం రోజున గిల్ కెప్టెన్సీలో టీమిండియా లంక గడ్డపై అడుగుపెట్టింది. అయితే జట్టుతో పాటు యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ వెళ్లకపోవడంతో ఆయన ఎక్కడున్నాడనే ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమైంది. సాయి సుదర్శన్ నిజానికి శ్రీలంక పర్యటనకు ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టుతో పాటు వెళ్లలేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
గాయం నుంచి కోలుకుంటున్న సుదర్శన్
సాయి సుదర్శన్ చేతి బొటనవేలికి గాయం కావడంతో ఆయన జట్టుకు దూరమయ్యారు. బీసీసీఐ అందించిన సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో రిహాబ్ పొందుతున్నారు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. సుదర్శన్ ఇప్పటికే బెంగళూరులో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇది భారత జట్టుకు, అభిమానులకు ఊరటనిచ్చే అంశం. అయితే శ్రీలంకలో ఆడేందుకు ఆయన ముందుగా ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది.
శ్రీలంకకు ఎప్పుడు వెళ్తారు?
తాజా సమాచారం ప్రకారం సాయి సుదర్శన్ ఆగస్ట్ 8న శ్రీలంకకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. భారత జట్టు ఆగస్ట్ 7 నుంచి శ్రీలంక ఎలెవన్తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. సమయం లేకపోవడంతో సుదర్శన్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు దూరం కానున్నారు. అయినప్పటికీ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టు సమయానికి ఆయన పూర్తిగా కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
శ్రీలంక టెస్ట్ సిరీస్కు భారత జట్టు వివరాలు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్పై ఆధారపడి ఉంది), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ దార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
భారత్ – శ్రీలంక టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్
మొదటి టెస్టు: ఆగస్ట్ 15 నుంచి 19 వరకు (2026), గాలే ఇంటర్నేషనల్ స్టేడియం, గాలే.
రెండో టెస్టు: ఆగస్ట్ 23 నుంచి 27 వరకు (2026), సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..