తెలంగాణలో జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై దృష్టి సారిస్తోంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా జీఎస్టీ అధికారులకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించి, పన్నుల పర్యవేక్షణను మరింత కచ్చితంగా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియ వల్ల వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
భవన నిర్మాణ రంగంలో జరుగుతున్న పన్ను లీకేజీలను అరికట్టేందుకు పలు ప్రభుత్వ శాఖల మధ్య డేటా సమన్వయాన్ని బలోపేతం చేయాలని సమావేశంలో చర్చించారు. మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల సమాచారాన్ని ఏఐ ద్వారా అనుసంధానం చేస్తే అక్రమాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అలాగే భారీ నిర్మాణాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు ఇచ్చే దశలోనే అవసరమైన నిర్మాణ సామగ్రి, దానికి సంబంధించిన పన్నుల అంచనాలను నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. దీంతో అంచనాలు, వాస్తవ వినియోగం మధ్య తేడాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమీకృత డేటా వ్యవస్థలో భాగం చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,