భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వేడెక్కుతున్న రాత్రులు ప్రజల నిద్ర నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతల వల్ల నగరవాసులు ప్రతి సంవత్సరం 65 నుండి 93 గంటల నిద్రను కోల్పోతున్నారని వాతావరణ పరిశోధన సంస్థ ‘క్లైమేట్ సెంట్రల్’ నిర్వహించిన ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణ మార్పులు నిద్ర ఆరోగ్యానికి ఎంతటి ముప్పుగా మారుతున్నాయో చెప్పడానికి ఈ నివేదిక ఒక ముఖ్యమైన హెచ్చరిక. నిపుణుల వివరాల ప్రకారం.. ప్రధాన భారతీయ మెట్రో నగరాలలో చెన్నైలో అత్యధికంగా సంవత్సరానికి సుమారు 93 గంటల నిద్రలేమి నమోదవుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, కోల్కతా, బెంగళూరు ఉన్నాయి. సాధారణంగా శరీర అంతర్గత ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమైనప్పుడే మెదడుకు సంకేతాలు అంది మనిషి గాఢ నిద్రలోకి జారుకుంటాడు. కానీ రాత్రంతా వేడిగా, తేమగా ఉండే వాతావరణం వల్ల ఈ సహజ శీతలీకరణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల నిద్ర వ్యవధి, నాణ్యత రెండు తగ్గుతాయి. ఫలితంగా రోగులు పగటిపూట అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, ఉదయం వేళ తలనొప్పి వంటి సమస్యలతో స్లీప్ క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. ఈ వేడి రాత్రుల ప్రభావం వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, ఊబకాయం ఉన్నవారితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారిపై మరింత ఎక్కువగా ఉంటుంది. పదేపదే నిద్రకు అంతరాయం కలగడం వల్ల రక్తపోటు పెరగడం, గ్లూకోజ్ జీవక్రియ దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య పరిణామాలు ఎదురవుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం పడకగదిలో గాలి ప్రసరించేలా చూసుకోవడం, కాటన్ పరుపులు వాడడం, పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, కెఫిన్, మద్యానికి దూరంగా ఉండడం వంటి అలవాట్లను వైద్యులు సూచిస్తున్నారు. వేడెక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిద్ర అనేది విలాసం కాదు, అదొక జీవసంబంధమైన అవసరమని, దీనిని ప్రజారోగ్య చర్చల్లో ప్రాధాన్య అంశంగా మార్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా