తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలు కావు, అవి అజరామర కావ్యాలు. మాయాబజార్, శంకరాభరణం వంటి క్లాసిక్ చిత్రాల సరసన నిలబడే ఒక అద్భుత సృష్టి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సాగర సంగమం. ఈ చిత్రం కొంతమంది విమర్శకులకు, ప్రేక్షకులకు శంకరాభరణం కన్నా గొప్పదని కూడా అనిపిస్తుంది. అలాంటి అపురూప చిత్రంలో మాధవి అనే ముఖ్యమైన పాత్రను పోషించారు నటి జయప్రద. ఆ సినిమా తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిందని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సాగర సంగమం గురించి ఐదు నిమిషాల్లో వర్ణించడం అసాధ్యమని, అది కేవలం ఒక సినిమా కాదని, ఒక కావ్యం అని జయప్రద పేర్కొన్నారు.
తన కెరీర్లోని ఎన్నో మంచి చిత్రాలలో, ఆణిముత్యాలలో ముందువరసలో సాగర సంగమం నిలుస్తుందని ఆమె అన్నారు. మాధవి పాత్ర తనకు లభించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని, ఒక నటిగా ఆ పాత్ర సవాలుతో కూడుకున్నప్పటికీ, దర్శకుడు కె. విశ్వనాథ్ పూర్తి మద్దతు, సహకారంతోనే దానిని పోషించగలిగానని ఆమె వెల్లడించారు. జయాప్రద తన కెరీర్ పీక్ స్టేజ్ లో, బాలీవుడ్లో సైతం కమర్షియల్ చిత్రాలు చేస్తున్న సమయంలో సాగర సంగమంలో ఓల్డ్ రోల్ చేయడానికి చాలా మంది ఆమెను వారించారని గుర్తుచేసుకున్నారు. “మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుంది, అట్లా చేయకూడదు” అని చాలా మంది అన్నప్పటికీ, తాను ఆ సినిమా తర్వాత రిటైర్ అయినా పర్వాలేదు అని దృఢంగా నిర్ణయించుకున్నానని తెలిపారు.
దర్శకుడు కె. విశ్వనాథ్ను జయప్రద బ్రహ్మగా కొనియాడారు. “ఈ సినిమాకి, ఈ నా కెరీర్ లో ఈయన మా డైరెక్టర్ గారు, హి ఈజ్ బ్రహ్మ ఆయన. కాబట్టి దర్శిక బ్రహ్మ అని ఎంతోమందిని నేను పిలుచుకున్నా, మా జీవితాల్లో ఆయనే మాకు బ్రహ్మ. ఆయన లేకుంటే ఇవ్వాళ నేను గానీ, కమలహాసన్ గానీ, చంద్రమోహన్ గారు గానీ ఎవరూ ఉండరు,” అని జయప్రద ఉద్వేగంగా చెప్పారు. పాత్రలను సృష్టించడం ఒక వంతు అయితే, వాటిని తెరపై పలికించడం ఇంకొక సవాలని ఆమె అన్నారు. నేటి హీరోలు ముగ్గురు హీరోయిన్లు, బ్యాంకాక్, స్విట్జర్లాండ్ లొకేషన్లు, డాన్సులు, ఖరీదైన డ్రెస్సులు కావాలనుకుంటున్నారని, అలాంటి సమయంలో ఏమీ అక్కర్లేకుండా ఒక పైజామా, ఒక పిచ్చి డ్రెస్ లాగా వేసుకుని, ఒక కుర్తా పైజామా, ఒక జోలాతో కమల్ హాసన్ నటించారని జయప్రద పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.