Headlines

పంజాగుట్ట శ్మశానవాటికలో ఏం జరిగింది..? హైదరాబాద్‌ నడిబొడ్డున క్షుద్రపూజల కలకలం.. | Hyderabad Punjagutta Cremation Ground Incident: Infant Body Found Outside Burial Site, Police Probe Underway

పంజాగుట్ట శ్మశానవాటికలో ఏం జరిగింది..? హైదరాబాద్‌ నడిబొడ్డున క్షుద్రపూజల కలకలం.. | Hyderabad Punjagutta Cremation Ground Incident: Infant Body Found Outside Burial Site, Police Probe Underway


ఐటీ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది.. అదికూడా ఏ మారుమూలో కాదు.. హైఫై ఏరియాగా పేరున్న బంజారాహిల్స్‌లో ఈ ముచ్చట పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడి శ్మశానంలో వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఇంతకీ అక్కడేం జరిగిందో తెలుసుకుందాం.. ఈనెల 9న పంజాగుట్ట శ్మశానంలో ఖననం చేసిన పసికందు మృతదేహం.. బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో అక్కడేమైనా క్షుద్రపూజలు జరిగాయా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. శ్మశానంలో పసిపాప శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో… కుక్కలు శవాన్ని బయటకు లాగాయా.. లేక ఎవరైనా తవ్వి తీశారా..? అనే చర్చ మొదలైంది.

కాటికాపర్ల పాత్రపై అనుమానం

ఈ అంశంలో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం బయటకు రావడంలో కాటికాపర్ల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 9,10 తేదీల్లో శ్మశానంలో వ్యక్తుల కదలికలపై సీసీ కెమెరాల ఆధారంగా ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల స్థానిక శ్రీనివాస్ దంపతులకు ట్విన్స్ పుట్టారు. అనారోగ్యంతో.. ఈనెల 9న ఒక శిశువు చనిపోవడంతో.. అదేరోజున పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఆనవాలు ఉండేలా పాతిపెట్టిన చోట ఒక బండరాయిని కూడా ఉంచారు. అయితే, ఇవాళ మరో శిశువు కూడా చనిపోవడంతో.. అదే చోట ఖననం చేసేందుకు వెళ్లిన కుటుంబసభ్యులు.. అక్కడ సిట్యుయేషన్‌ చూసి షాకయ్యారు. పసికందును ఖననం చేసిన చోట తవ్వినట్టుగా కనిపించడంతో.. కాటికాపరులను ప్రశ్నించారు. గుంతను తవ్వి చూడగా మృతదేహం కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.

బంజారాహిల్స్ సీఐ ఏమన్నారంటే..

రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టిన పసికందు బయటకు ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు బంజారాహిల్స్ సీఐ సుహాన్ తెలిపారు. పసికందును పూడ్చిపెట్టిన స్థలంలో క్లూస్ సేకరిస్తున్నట్లు తెలిపారు. 9,10 వ తేదీ రాత్రి పంజాగుట్ట స్మశాన వాటిక లో వ్యక్తుల కదలికలపై దర్యాప్తు చేపడుతున్నామని.. స్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. పసికందును పూడ్చిపెట్టిన స్థలంలో క్లూస్ సేకరించారు. ఇది మనుషుల పనా? జంతువుల పనా? అనే కోణంలో విచారిస్తున్నారు. క్షుద్రపూజలేమైనా జరిగాయా? అనే అనుమానాలు వస్తుండటంతో ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *