Headlines

కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందా? ఆపరేషన్ సింధూర్‌ అసలు నిజం బయటపెట్టిన మాజీ సీడీఎస్ | India hit Kirana Hills? Former CDS General Anil Chauhan explains what happened during Operation Sindoor


ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌లోని సర్ఘోడా సమీపంలోని కిరానా హిల్స్‌పై భారత్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందా? అనే ప్రశ్నలకు మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు. కిరానా హిల్స్ వద్ద కనిపించిన పొగలకు భారత దాడి ఒక కారణం అయి ఉండొచ్చనే ప్రచారంపై స్పందించిన ఆయన.. రాడార్ల కోసం వెతుకుతున్న ఓ లోయిటరింగ్ మ్యూనిషన్ తన లక్ష్యాన్ని గుర్తించలేక కొండల్లోని ఒక ప్రాంతాన్ని ఢీకొని ఉండొచ్చని తెలిపారు.

సర్ఘోడాకు ఉత్తరంగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరానా హిల్స్‌కు పాకిస్థాన్ అణు మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడి నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు పాకిస్థానీ మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో భారత్ ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కిరానా హిల్స్‌పై ఉద్దేశపూర్వక దాడి జరగలేదని చౌహాన్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రమంలో మాట్లాడిన చౌహాన్.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులకు ముందు సర్ఘోడా చుట్టూ రాడార్లను గుర్తించేందుకు లోయిటరింగ్ మ్యూనిషన్స్‌ను మోహరించినట్లు చెప్పారు. లక్ష్యం దొరకకపోతే ఇలాంటి ఆయుధాలు కొంతసేపు గాల్లో తిరిగి చివరికి కిందకు పడిపోతాయని వివరించారు.

ఆపరేషన్ సింధూర్‌లో భారత్ తక్కువ గగనతలం వ్యూహాన్ని విస్తృతంగా వినియోగించిందని చౌహాన్ తెలిపారు. డ్రోన్లు, లోయిటరింగ్ మ్యూనిషన్స్, అటాక్ హెలికాప్టర్లు వంటి వేదికలను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక దాడులకు అవకాశం పెరిగిందన్నారు. ఇది ఉరి, పుల్వామా ఘటనల తర్వాత భారత్ అనుసరించిన విధానాలకు భిన్నమైన ‘మూడో మార్గం’ అని పేర్కొన్నారు.

పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చిన సమయంలోనూ సర్ఘోడాపై దాడి కొనసాగించేందుకు తాను అనుమతించినట్లు చౌహాన్ వెల్లడించారు. అనంతరం మరిన్ని లక్ష్యాలను గుర్తించాలని సూచించినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని లక్ష్యాలను మార్చాల్సి వచ్చిందన్నారు. భారత విజయానికి మెరుగైన పరిస్థితుల అవగాహన, యుద్ధభూమిపై పారదర్శకత, మూడు దళాల మధ్య మెరుగైన నెట్‌వర్క్, సమన్వయం కీలక కారణాలని చౌహాన్ పేర్కొన్నారు. స్పష్టమైన రాజకీయ మార్గదర్శకత్వం వల్ల సైన్యానికి కార్యాచరణ స్వేచ్ఛ లభించిందన్నారు.

2025 మే 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయి. మే 10న కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడంతో సైనిక ఘర్షణ ముగిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *