Headlines

వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.. | Valmiki Corporation Scam: Karnataka Congress Minister B. Nagendra Resigns Amid Allegations


వాల్మీకి అభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం విధానసౌధలో రాజీనామా నిర్ణయం ప్రకటిస్తూ నాగేంద్ర కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తనను టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. హైకమాండ్‌ ఆదేశాలతో నాగేంద్ర రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ఆదివాసీ వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి దక్కడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని , మనుస్మృతిని నమ్మే బీజేపీ నేతలు తనను టార్గెట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకీ కుంభకోణంలో తన పాత్ర లేదని సిట్‌ , సీఐడీ సంస్థలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని.. కుట్రతో సీబీఐ,ఈడీ దర్యాప్తు చేయించారన్నారు. అనంతరం తనను అరెస్ట్‌ చేయించి జైల్లో పెట్టారంటూ నాగేంద్ర మండిపడ్డారు.

కాగా.. నాగేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్దిరోజులుగా కర్నాటకలో బీజేపీ ఆందోళనలు చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంభింప చేశారు. 2024లో కూడా నాగేంద్ర ఇవే ఆరోపణలతో సిద్దరామయ్య కేబినెట్‌ నుంచి రాజీనామా చేశారు. డీకే శివకుమార్‌ సీఎం పగ్గాలు చేపట్టిన తరువాత మళ్లీ ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. దీనిపై బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *