టీ20 క్రికెట్లో తనదైన దూకుడైన బ్యాటింగ్తో అలరించే భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి సత్తా చాటాడు. శేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 తొలి మ్యాచ్లోనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్గా బరిలోకి దిగిన అభిషేక్.. మొహాలీ కింగ్స్పై కేవలం 26 బంతుల్లో 77 పరుగులు బాదాడు. టాస్ గెలిచిన మొహాలీ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే అభిషేక్ శర్మ ఆ నిర్ణయాన్ని తప్పని నిరూపించాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.
మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్రేట్ ఏకంగా 296.15గా ఉండటం విశేషం. ముఖ్యంగా ఐదో ఓవర్లో వరుసగా సిక్సర్లతో విరుచుకుపడి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.
ఓపెనింగ్లోనే సెంచరీ భాగస్వామ్యం..
అభిషేక్కు తోడుగా వచ్చిన సహజ్ ధావన్ కూడా దూకుడుగా ఆడాడు. అతడు 18 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఈ జోడీ తొలి వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పింది.
అనంతరం నమన్ ధీర్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్తో 47 పరుగులు చేశాడు. రాహుల్ కుమార్ 13 బంతుల్లో 23, అభయ్ చౌదరి 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. దీంతో అమృత్సర్ సూర్మాస్ 19.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.
బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్..
మొహాలీ బౌలర్లలో నిపుణ్ పండిత్ రెండు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. మన్ప్రీత్ జోహల్ రెండు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ నాలుగు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు పడగొట్టాడు. తేజ్ప్రిత్ సింగ్ మూడు వికెట్లు సాధించాడు.
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా అమృత్సర్ భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లోనూ తనదైన హిట్టింగ్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ బ్యాటర్.. శేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లోనూ అదే దూకుడును కొనసాగించడం అభిమానులను ఆకట్టుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..