Headlines

Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్.. అకౌంట్లోకి నేరుగా రూ.15 వేలు.. ముహూర్తం ఫిక్స్.. | Thalliki Vandanam Funds: AP Government To Credit Pending Dues & New Students’ Payments In 3 Days


తల్లికి వందనం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. గతంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయగా.. కొంతమందికి అందలేదు. డబ్బులు పడనివారికి సమస్యను పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఆగిపోయినవారికి ఇప్పుడు జమ చేయనున్నారు. మరో మూడు రోజుల్లో వీరి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేయనుంది. వీరికే కాకుండా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా ఆర్ధిక సాయం అందించనున్నారు. మొత్తం సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

మూడు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు

ఆగస్ట్ 30వ తేదీనే ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు సాంకేతిక కారణాలన్నీ పరిష్కరించడంతో మరో మూడు రోజుల్లో నిధులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దీంతో గతంలో డబ్బులు పడకపోవడంతో వాటి కోసం ఎదురుచూస్తున్నవారితో పాటు ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఇప్పుడు అందనున్నాయి. విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రుల ఖాతాల్లో వీటిని నేరుగా జమ చేయనున్నారు. గతంలో పడనివారిని గుర్తించి ప్రభుత్వం లబ్దిదారుల జాబితా పున:పరిశీలన చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హత ఉండి డబ్బులు పడనివారిని గుర్తించారు. వీరిని గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేర్చారు. ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత ఆర్థికశాఖ నుంచి తల్లిదండ్రుల ఖాతాల్లో నిధుల జమ కానున్నాయి. గతంలో అర్హత ఉండి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న వారికి, వాటి కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ విడతలో డబ్బులు పడనున్నాయి. దీంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు..

తల్లికి వందనం పథకం ద్వారా ఈ స్కీమ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు దీనిని వర్తింపచేస్తోంది.  ఈ స్కీమ్ ద్వారా స్కూల్, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తోంది. స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటోంది. వీటిని జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో వేస్తోంది. మిగతా రూ.13 వేలు తల్లిదండ్రులకు అందిస్తోంది. విద్యార్థులను స్కూల్‌లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, డ్రాఫౌట్స్‌ను తగ్గించేందుకు ఈ స్కీమ్ వర్తింపచేస్తున్నారు. అలాగే విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం కొంతమేర ఆర్ధిక సాయం అందిస్తోంది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ పథకం అమలు చేయగా.. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో వర్తింపచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *