Headlines

 ఇరాన్ నుంచి ఆ నౌక వస్తోంది..  థాయ్ సెక్స్ వర్కర్ల పై పోలీసుల దాడులు..! | Thailand raids Pattaya sex workers as USS Abraham Lincoln arrives with 5,000 sailors


పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి  సముద్ర జలాల్లో  మోహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్’ ఎట్టకేలకు అమెరికాకు వెనుదిరిగింది. ఈ నౌకలో దాదాపు 5,000 మంది అమెరికా సైనికులున్నారు. గత 200 రోజులకు పైగా వీరు సముద్రంలోనే ఉండిపోవడంతో, కనీస సౌకర్యాలు అందక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ ఒత్తిడి కారణంగా కొందరు నావికులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరానికి రానుంది.  సైనికుల రాకను దృష్టిలో ఉంచుకుని పట్టాయా నగరంలో పోలీసులు సెక్స్‌వర్కర్లపై దాడులు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టాయా, నైట్‌లైఫ్‌ ఇంకా బీచ్‌లకు ప్రసిద్ధి.  పట్టాయా సిటీకి దగ్గరలో ఉన్న చాబాంగ్‌ పోర్టు వద్ద యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్  నౌక లంగరు వేయనుంది. సైనికుల రాకతో నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బీచ్‌లు, నైట్‌లైఫ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచి, సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే నౌక వచ్చిన తర్వాత పట్టాయాలో పరిస్థితులు పూర్తిగా తమ అదుపులోనే ఉంటాయని చెప్పడం కష్టమని స్థానిక పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నౌక రావడం వల్ల భద్రతాపరంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, పట్టాయా నగర ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది ఎంతో కలిసొస్తుందనే అంచనాలున్నాయి. పట్టాయా పూర్తిగా పర్యాటకం, వినోద రంగం పైనే ఆధారపడి నడుస్తోంది కాబట్టి, సైనికుల రాకతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మరింత లాభసాటిగా మారుతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న పట్టాయా, కాలక్రమంలో ప్రపంచ ప్రసిద్ధ వినోద కేంద్రంగా మారింది. వియత్నాం యుద్ధ సమయంలో థాయ్‌లాండ్‌లో మోహరించిన అమెరికా సైనికులు వినోదం కోసం పట్టాయాకు తరలివచ్చేవారు. సైనికుల రాకతో మొదలైన మార్పు క్రమంగా ఆ ప్రాంతాన్ని ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేసింది.

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది.   పసిఫిక్ మహాసముద్ర జలాల్లోని శాన్‌డియాగో పోర్ట్ వద్ద ‘అబ్రహాం లింకన్’ యుద్ధ నౌకను మోహరించి ఉంచుతారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తడానికి సరిగ్గా కొన్ని వారాల ముందు ఈ నౌక ను అత్యవసరంగా గల్ఫ్‌ జలాల్లోకి తరలించారు.  నాటి నుంచి అక్కడే విధుల్లో ఉన్న ఈ నౌక, తాజాగా గల్ఫ్‌ జలాలను వీడి అమెరికా వైపు పయనిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *