మద్యం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొందరు ఏకంగా చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లనే మద్యం మాదిరిగా వినియోగిస్తున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో వాటి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్ సమయంలో సులభంగా లభించేలా ఇచ్చిన లైసెన్స్ మినహాయింపే ఇప్పుడు దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందన్న అభిప్రాయంతో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రానికి లేఖ రాసింది.
మద్యం బదులు శానిటైజర్
ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు మద్యం ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ పీ. అరుణ్బాబు తెలిపారు. దీంతో వాటి నిల్వ, విక్రయాలపై నియంత్రణ అవసరమని కేంద్రాన్ని కోరారు.
విజయవాడలో తనిఖీలు.. భారీ విక్రయాలు
విజయవాడ నగరంలో అధికారులు తనిఖీలు, దాడులు నిర్వహించారు. కొన్ని రిటైల్ మెడికల్ షాపులు ఇథనాల్ ఆధారిత శానిటైజర్లను పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ దృష్టిని ఆకర్షించింది.
33,586 సీసాల కొనుగోలు, విక్రయం
పటమటలోని సాయి వెంకటేశ్వర ఫార్మసీ అండ్ సర్జికల్కు సంబంధించిన బిల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్లుల ప్రకారం ఏడాదిన్నర వ్యవధిలో 70 శాతం ఇథనాల్ ఉన్న 100 ఎంఎల్ శానిటైజర్ సీసాలు 33,586 కొనుగోలు చేసి విక్రయించినట్లు వెల్లడైందని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
మూడు విక్రయ కేంద్రాలపై చర్యలు
ఇథనాల్ శానిటైజర్ల విక్రయాల వ్యవహారంలో మూడు రిటైల్ విక్రయ కేంద్రాలపై లైసెన్స్ రద్దు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శానిటైజర్లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు.
కొవిడ్ సమయంలో మినహాయింపు
కొవిడ్ సమయంలో శానిటైజర్లు సులభంగా అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020 జులై 27న ఎస్.ఓ.245(ఈ) నోటిఫికేషన్ ద్వారా వాటి నిల్వ, విక్రయాలకు సేల్ లైసెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే నాలుగేళ్లు దాటినా ఆ మినహాయింపు కొనసాగుతుండటంతో ఇథనాల్ ఆధారిత శానిటైజర్ల దుర్వినియోగానికి అవకాశం ఏర్పడుతోందని రాష్ట్ర అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మినహాయింపు ఎత్తివేయాలంటూ కేంద్రానికి లేఖ
ఇథనాల్ ఆధారిత శానిటైజర్ల నిల్వ, విక్రయాలకు ఇచ్చిన సేల్ లైసెన్స్ మినహాయింపును ఉపసంహరించాలని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రాన్ని కోరింది. మార్కెట్లో ఇథనాల్ లేని ప్రత్యామ్నాయ హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక మినహాయింపు కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్.ఓ.245(ఈ) నోటిఫికేషన్ను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కోరింది. శానిటైజర్ల అసలు ఉద్దేశం చేతుల పరిశుభ్రత కాగా.. వాటిని ఇతర ప్రయోజనాలకు దుర్వినియోగం చేసే పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర శాఖ కేంద్రానికి సూచించింది.