Headlines

వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలిస్తే! | Kanpur News: Woman Hires Servant for Rs 6 Lakh to Kill Father in Law Over CCTV Surveillance


ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి, ఎప్పుడూ చేస్తున్నారో గమనిస్తూ, ఎక్కడికీ వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారనే కోపంతో ఓ ఇళ్లాలు దారుణానికి ఒడిగట్టింది. పనిమనిషికి రూ.6 లక్షల సుపారీ ఇచ్చి, తనపై నిఘా పెట్టిన మామయ్యను హత్య చేయించింది. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని కల్యాణ్‌పుర్‌ ఠాణా పరిధికి చెందిన వినీత్‌ మనోచా అనే వ్యాపారికి సుబ్రత్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం కుమారుడికి శాలు అనే యువతితో వివాహం జరిపించారు. అప్పటి నుంచి అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మనోచా ఔషధ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లైన తర్వాత కొడుకు సుబ్రత్, కోడలు శాలు కూడా ఆయన వ్యాపారంలో సాయం చేసేవారు. ఇందుకుగాను మనోచా కొడుకుకు నెల జీతంగా రూ.35 వేలు, కోడలికి ఇంటి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఇచ్చేవాడు.

డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మనోచా, ఇంట్లో వాళ్లపై నిఘా ఉంచేందుకు ఇల్లంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. వాటి ద్వారా నిరంతరం కొడుకు, కోడలి కదలికలను గమనిస్తుండేవాడు. మామగారి ఆంక్షలతో విసిగిపోయిన శాలు.. ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలనుకుంది. ఇందుకోసం గతంలో తమ ఇంట్లో పనిచేసిన గౌతమ్ అనే వ్యక్తితో మామగారి హత్యకు పథకం రచించింది. మామను చంపేస్తే రూ.6 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది.

పథకం ప్రకారం.. ఈ నెల ఐదో తేదీన ఏదో పార్టీ ఉందని చెప్పి భర్తను, పిల్లలను తీసుకొని శాలు బయటకు వెళ్లిపోయింది. అదే అదనుగా భావించిన గౌతమ్ డూప్లికేట్ కీతో ఇంట్లోకి చొరబడి మనోచా రాక కోసం వేచి చూశాడు. రాత్రి 11 గంటల సమయంలో దుకాణం ముగించుకుని ఇంటికి వచ్చిన మనోచాపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హత్య చేసిన గౌతమ్‌తో పాటు కోడలు శాలును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *