కావలసిన పదార్థాలు: ఉండ్రాళ్ల పిండి కోసం: 2 కప్పుల తడి బియ్యపు పిండి, అర టీస్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, సుమారు ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు, అర టేబుల్ స్పూన్ నూనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 ఊరమిరపకాయలు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు తాజా కరివేపాకు.
తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల బియ్యపు పిండి, అర టీస్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేయాలి. ఇందులో కాచిన వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పిండి బాగా కలిసి మృదువైన తర్వాత మూతపెట్టి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న గోళీల్లా చుట్టుకోవాలి.
ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్లో నీళ్లు పోసి మరిగించాలి. చిల్లుల ప్లేట్కు కొద్దిగా నూనె రాసి, తయారు చేసుకున్న ఉండ్రాళ్లను అమర్చాలి. మూతపెట్టి హై ఫ్లేమ్పై సుమారు 8 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి పక్కన ఉంచాలి. స్టవ్ వెలిగించి చిన్న పాన్లో అర స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. ఇందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి.
ఆపై ఊరమిరపకాయలు వేసి వేయించాలి. చివరగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక్క నిమిషం వేపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోవాలి. మరొక బాండీలో స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
అందులోనే ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న బియ్యపు పిండి ఉండ్రాళ్లను వేసి టాస్ చేయాలి. చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారం పొడిని వేసి, ఉండ్రాళ్లకు అంతా సమంగా పట్టేలా కలిపి ఒక నిమిషం పాటు వేయించి దించాలి. అంతే, ఘుమఘుమలాడే వినాయక చవితి స్పెషల్ కారం ఉండ్రాళ్లు సిద్ధం!




