Headlines

Hyderabad: ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనానికి వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వాహనాలు బంద్.. 12 రోజుల పాటు నో పర్మిషన్.. | Khairatabad Ganesh Darshan Begins Today; Traffic Restrictions in Place from September 12 to 24


ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా బడా గణపతి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గణేషుడిని దర్శించుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. భక్తుల పెద్ద సంఖ్యలో తరలిరానుండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉండనుండగా.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.

వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనదారులను నిరంకారి జంక్షన్ వైపు దారి మళ్లించనున్నారు. అలాగే పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాజ్ దూత్ లైన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు దారి మళ్లించనున్నారు. ఇక ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వెహికల్స్‌ను మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు దారి మళ్లించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనదారులను సెక్రటేరియట్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు దారి మళ్లిస్తారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ వైపు మళ్లించనున్నారు. దీంతో ఖైరతాబాద్ వైపు వచ్చేవారు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇక ఖైరతాబాద్ దర్శనానికి వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వారికి రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాకస్ సమీపంలోని హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చే వాహనదారులు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు సొంత వాహనాల కంటే బస్సులు, మెట్రో లాంటి ప్రజా రవాణాను ఉపయోగించుకుంటే మంచిదని సూచించారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. భక్తులు ట్రాఫిక్‌ రూల్స్ పాటించి సహకరించాలని సూచించారు. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *