ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న కూటమి సర్కార్.. తాజాగా వారికి ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ-ఆటోల కొనుగోలుకు కూడా బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకి లోన్ ఇప్పించనుంది. అలాగే ప్రభుత్వం నుంచి భారీగా రాయితీ కూడా అందించనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-ఆటోను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వారికి రాయితీలపై వీటిని అందించే ప్రొగ్రాంకు శ్రీకారం చుట్టింది.
ఈ-ఆటోలపై భారీ రాయితీ
డ్వాక్రా సంఘాలకు ఈ-ఆటోల కొనుగోలుపై భారీ రాయితీ ప్రభుత్వం కల్పిస్తోంది. అలాగే కాకుండా తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలతో పాటు సులభ వాయిదాల్లో వాటిని చెల్లించే సౌకర్యం కల్పించనుంది. దీంతో దీని ద్వారా లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని మెప్మా అధికారులు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న డ్వాక్రా సంఘాలు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. గతంలో కొంతమంది దరఖాస్తు చేసుకోగా.. వారికి సబ్సిడీపై ఆటోలు అందించారు. ఇప్పుడు మరింతమందికి లబ్ది చేకూర్చే ప్రయత్నాలను మెప్మా మొదలుపెట్టింది. ఈ-ఆటో విలువ రూ.4.5 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం రూ.లక్ష రాయితీ సౌకర్యం కల్పి్స్తోంది. దీంతో రూ.3.5 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందుకు బ్యాంక్ ద్వారా ప్రభుత్వం రుణం ఇప్పించనుంది. ఈ ఆటోలను డ్వాక్రా సంఘాలు లేదా వీరి కుటుంబసభ్యుల్లో ఎవరైనా నడిపించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం ఉపాధి పొందవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా రాయితీ
కొంతమంది ఆటోలను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ నిర్వాహకులు అధిక వడ్డీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తక్కువ వడ్డీ రేటు, రాయితీలో వీటిని అందించనుంది. అలాగే మహిళలకు రాయితీపై ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా అందిస్తున్నారు. ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుంటే రూ.12 వేల రాయితీ అందిస్తారు. అలాగే బ్యాంక్ రుణం కూడా అందిస్తారు. ఈ సదుపాయం పొందేందుకు మెప్మా అధికారులను సంప్రదించాలి. అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది మహిళలు రాయితీపై వీటిని అందుకున్నారు. ఇప్పుడు మరింతమందికి అందించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోని మహిళలు ఎక్కువగా తీసుకుంటుండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ ప్రయోజనాలను తీసుకోవడం లేదు.