కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 135 ఏళ్ల నాటి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 1891 స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో బ్యాంకింగ్ ఖాతాదారులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత గోప్యత విషయంలో వివాదాస్పదంగా మారుతుంది. అలాగే బ్యాంకింగ్స్ రూల్స్లో అనేక మార్పులు రానున్నాయి. బ్యాంకింగ్ రికార్డులను పేపర్ రిజిస్టర్లు, లెడ్జర్లలో భద్రపర్చే రోజుల్లో పాత చట్టం రాగా.. ఇప్పుడు అన్నీ డిజిటలైజ్ అయిన క్రమంలో కోర్టులో సాక్ష్యాలకు బ్యాంక్ రికార్డులను చట్టపరమైన సాక్ష్యంగా గుర్తించనున్నారు. అయితే దీనిపై బ్యాంకింగ్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.
పోలీసులు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు
ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలను పోలీసులు బ్యాంక్ నుంచి సులభంగా పొందవచ్చు. దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే వాదనలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్తో పాటు క్లౌడ్ ఆధారిత బ్యాంక్ రికార్డులను కోర్టుల్లో చట్టబద్దమైన బ్యాంక్ పుస్తకాలుగా పరిగణిస్తారు. ఈ లావాదేవీల రికార్డులను కోర్టుల్లో సాక్ష్యాలుగా సమర్పించవచ్చు. కోర్టుల్లో కూడా ఇవి చెల్లుతాయి. కానీ డేటాను తారుమారు చేయకపోవడం వంటి నియామాలను పాటించాల్సి ఉంటుంది. కోర్టుల్లో విచారణ కోసం బ్యాంకులు ఫిజికల్, డిజిటల్ కాపీలను సమర్పించాల్సిన పని లేకుండా ధృవీకరించబడిన కాపీ లేదా సారాంశం అందిస్తే సరిపోతుంది. డేటా సురక్షితమని, సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందని ఒక సాంకేతిక ధృవీకరణ పత్రం బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది.
కోర్టు అనుమతి లేకుండానే..
ఇక నుంచి పోలీసులు లేదా దర్యాప్తు అధికారులు కేసు విచారణ కోసం కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకుల నుంచి ఖాతాదారుల సమాచారం తెలుసుకోవచ్చు. సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే పై స్థాయిలో ఉన్న అధికారులకు ఈ అనుమతి ఉంటుంది. ఇతర సమయాల్లో బ్యాంకులు ఈ సమాచారాన్ని కస్టమర్కు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆర్ధిక నేరాలు, జాతీయ భద్రత వంటి విషయాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పుడు కస్టమర్కు తెలియకుండానే బ్యాంక్ రికార్డులు పొందవచ్చు. ఇక ఏదైనా కేసులో బ్యాంక్కు నేరుగా సంబంధం లేకపతే సాక్ష్యం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు పదే పదే కోర్టులో హాజరుకావాల్సిన అవసరం ఉండదు. అయితే బ్యాంక్ రికార్డుల ప్రమాణికతపై కోర్టుకు అనుమానం కలిగితే దర్యాప్తుకు పిలవొచ్చు. ఎన్ఎఫ్బీసీలు, బీమా కంపెనీలు, పింఛన్ నిధులు, ఇతర ఆర్ధిక సంస్థలు కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావొచ్చు.