Cricket Records: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డులు ఎన్నో. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు, వంద సెంచరీల ఘనత సాధించిన సచిన్ ఖాతాలో మరో మైండ్ బ్లాకింగ్ టెస్ట్ రికార్డ్ ఉంది. రాబోయే వందేళ్లలో కూడా ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 59 వేర్వేరు వేదికల్లో మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే ప్రతి ప్రముఖ దేశంలోనూ అడుగుపెట్టిన సచిన్, సుదీర్ఘంగా 24 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలోనే ఆయన 59 రకరకాల మైదానాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి ఈ చెరిగిపోని ఘనతను సొంతం చేసుకున్నాడు.
రేసులో సచిన్ తర్వాతి స్థానాల్లో ఉన్న దిగ్గజాలు
ఈ ప్రత్యేక జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ మాజీ దిగ్గజం శివనారాయణ్ చందర్పాల్ నిలిచాడు. చందర్పాల్ తన సుదీర్ఘ కెరీర్లో 58 వేర్వేరు వేదికల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. కేవలం ఒకే ఒక్క మైదానం తేడాతో సచిన్ కంటే వెనుకబడ్డాడు. భారత క్రికెట్ దిగ్గజం ది వాల్ రాహుల్ ద్రవిడ్ 55 వేదికల్లో టెస్టులు ఆడి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 52 వేదికలతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.
టాప్ లిస్టులో కుంబ్లే, లక్ష్మణ్
భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్ 52 వేదికల్లో, అనిల్ కుంబ్లే 51 వేర్వేరు మైదానాల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడి టాప్ లిస్టులో నిలిచారు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 51 వేదికల్లో ఆడగా, ఇంగ్లాండ్ పేస్ గన్ జేమ్స్ అండర్సన్, ప్రోటీస్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలీస్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే చెరో 50 వేదికల్లో టెస్టులు ఆడి ఈ ఘనత సాధించారు.
వందేళ్లయినా ఈ రికార్డు చెరిగిపోదు
నేటి ఆధునిక క్రికెట్లో ఫార్మాట్లు మారడం, వరుస లీగ్ మ్యాచ్లు పెరిగిపోవడంతో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య తగ్గుతోంది. నిర్దిష్టమైన వేదికల్లోనే ఎక్కువ మ్యాచ్లు నిర్వహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా 59 వేర్వేరు మైదానాల్లో టెస్టులు ఆడటం ఏ ఆటగాడికి కూడా సాధ్యమయ్యేలా లేదు. అందుకే క్రికెట్ చరిత్రలో సచిన్ పేరు మీద ఉన్న ఈ రికార్డు రాబోయే నూరేళ్లయినా చెక్కుచెదరదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..