Headlines

ODI World Cup: ఊహించని షాక్.. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. ఇక అలా జరిగితేనే..! | West indies fail to secure direct qualification for 2027 odi world cup

ODI World Cup: ఊహించని షాక్.. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. ఇక అలా జరిగితేనే..! | West indies fail to secure direct qualification for 2027 odi world cup


West Indies World Cup 2027 Qualification: రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2027 వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడటంతో ఇక క్వాలిఫైయర్ పోరు ద్వారానే టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. గత పరాభవాల నుంచి పాఠాలు నేర్వని విండీస్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే వెస్టిండీస్ జట్టుది ఎవరికీ అందని ప్రత్యేకమైన చరిత్ర. 1975, 1979లలో వరుసగా తొలి రెండు ప్రపంచకప్ ట్రోఫీలను ముద్దాడిన కరీబియన్ దిగ్గజాలు, రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుని తమ సత్తా చాటారు. అలాంటి అగ్రశ్రేణి జట్టు నేడు 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఐసీసీ ప్రకటించిన నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచే జట్లతో పాటు ఆతిథ్య దేశాలు మాత్రమే నేరుగా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతాయి.

ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్!

ఇవి కూడా చదవండి



అయితే, బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏకైక విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. దీంతో కరీబియన్ జట్టు పదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు ఆతిథ్య హోదా కలిగిన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ముందంజ వేయడంతో వెస్టిండీస్ ఆశలు ఆవిరైపోయాయి.

భారత్‌తో మ్యాచ్‌లు గెలిచినా మారని రాత..!

ముందుగా నిర్ణయించిన కటాఫ్ తేదీ కంటే ముందు వెస్టిండీస్ జట్టు టీమిండియాతో రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. అయితే ఒకవేళ వెస్టిండీస్ ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత్‌పై అద్భుత విజయాలు సాధించినా సరే, వారి ర్యాంకింగ్ పాయింట్లు పెరగవు. ఆఫ్ఘనిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి చేరుకోవడం సాంకేతికంగా ఏమాత్రం సాధ్యం కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కరీబియన్ జట్టు మరోసారి ప్రపంచకప్ క్వాలిఫైయర్ రౌండ్ ఆడటం అనివార్యమైంది.

ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ విండీస్‌కు ఇలాంటి ఘోర పరాభవమే ఎదురైంది. అప్పట్లో నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడిన విండీస్, సూపర్‌-6 దశలో నీరసించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాదాపు అర శతాబ్ద కాలపు వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా కరీబియన్ జట్టు లేకుండానే ప్రధాన టోర్నీ జరిగింది. ఆ పరాభవం కారణంతోనే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే చేదు అనుభవం ఎదురవడంతో కరీబియన్ క్రికెట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాయి.

2027 ప్రపంచకప్ మార్గం ఎంత కఠినమంటే..

ఇకపై జరగనున్న 10 జట్ల ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో వెస్టిండీస్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో ఐర్లాండ్‌తో పాటు క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 నుంచి వచ్చిన అత్యుత్తమ జట్లు, ప్లే-ఆఫ్స్ విజేతలు పోటీపడతాయి. 14 జట్లతో జరగనున్న 2027 ప్రపంచకప్ ప్రధాన ఘట్టంలో అడుగు పెట్టాలంటే విండీస్ జట్టు కఠినమైన సవాళ్లను దాటాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు మాత్రమే నేరుగా ప్రపంచకప్ ద్వితీయ రౌండ్‌లో ప్రవేశించే అవకాశం లభిస్తుంది.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఒకవేళ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడంలో విఫలమైతే, ఆ తదుపరి రెండు, మూడు, లేదా నాలుగో స్థానాల్లో ముగించాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో నిలిచిన జట్లు “సూపర్ సిరీస్” ప్లే-ఆఫ్ రౌండ్‌లో తలపడతాయి. అక్కడ జరిగే ముక్కోణపు పోరులో విజేతగా నిలిచిన జట్టు మాత్రమే ప్రపంచకప్‌లో మిగిలిన చివరి స్థానాన్ని దక్కించుకుంటుంది. ఈ ప్రక్రియ చిన్న దేశాల జట్లకు అద్భుత అవకాశం కల్పించినప్పటికీ, ఒకనాటి దిగ్గజ జట్టు వెస్టిండీస్‌కు మాత్రం ఇది అగ్నిపరీక్షలా మారింది.

కరీబియన్ క్రికెట్ పతనానికి కారణాలేంటి..?

కరీబియన్ ద్వీపకల్పంలో ఒకప్పుడు వెలుగువెలిగిన క్రికెట్ వైభవం గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. బోర్డులో నెలకొన్న రాజకీయాలు, ఆటగాళ్లకు దక్కాల్సిన ఆర్థిక ప్రోత్సాహకాలు లేకపోవడం, యువ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్ మ్యాచ్‌ల వైపు మక్కువ చూపడం జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీశాయి. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనలో స్థిరత్వం లోపించడం, క్లిష్ట సమయాల్లో చేతులెత్తేయడం వరుస ఓటములకు కారణమయ్యాయి. ఈ తప్పుల నుంచి సరైన పాఠాలు నేర్చుకోకపోతే, రాబోయే రోజుల్లో కరీబియన్ క్రికెట్ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *