Headlines

RBI: లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు.. | RBI New Loan Rules: Banks Cannot Change Interest Rate Benchmarks Without Borrower Consent


లోన్లు తీసుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. వడ్డీ రేట్లను ఇకపై బ్యాంకులు ఎలా పడితే అలా మార్చలేవు. ఏకపక్షంగా వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ధారించలేవు. ఒకవేళ వడ్డీ రేట్లకు సంబంధించి బెంచ్ మార్క్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే ఖచ్చితంగా వినియోగదారుడి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణ వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త ఫ్రేమ్ వర్క్ తాజాగా విడుదల చేసింది. వడ్డీ రేట్లను నిర్ణయించే బేస్ రేటుపై ఆర్బీఐ పలు నిబంధనలు రూపొందించింది. బ్యాంకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖాతాదారులు నష్టపోతున్నారు. దీంత ఖాతాదారులు నష్టపోకుండా వారిని రక్షించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..

రుణ ధరలను నిర్ణయించడంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ఈ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. స్థిర, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు, బెంచ్ మార్క్ ఎంపిక, వడ్డీ రేట్లలో మార్పులు, స్ప్రెడ్‌లు , ప్రస్తుత రుణాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం రుణగ్రహీత అనుమతి లేకుండా రుణ బెంచ్‌మార్క్‌ను మార్చలేరు. కొత్త వడ్డీ రేట్లు, బెంచ్ మార్క్ మార్పుకు ముందు వర్తించే రేటు కంటే ఎక్కువ ఉండకూడదు. కేవలం బ్యాంక్ ఒక బెంచ్ మార్క్ నుంచి మరో బెంచ్ మార్క్‌కు మార్చినంత మాత్రాన రుణగ్రహీతలు రుణ ఖర్చుల్లో ఆకస్మిక పెరుగుదలను ఎదుర్కొలేరు. ఇక బేస్ రేటు మార్పు వల్ల రుణగ్రహీతకు ఎలాంటి హాని కలగకుండా బ్యాంకులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక మార్పులు చేసినప్పుడు ఖాతాదారుడి నుంచి ఎలాంటి రుసుంలు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆర్బీఐ ప్రతిపాదనలు ఇవే..

ఇక ఫ్లోటింగ్ రేట్ రుణానికి ఉపయోగించే బెంచ్‌మార్క్ ఇకపై అందుబాటులో లేని పరిస్థితులను కూడా ఆర్‌బీఐ తన గైడ్‌లైన్స్‌లో ప్రస్తావించింది. అటువంటి సందర్భాల్లో రుణగ్రహీత ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసుకుంటూ.. రుణదాత ఆ రుణాన్ని మరొక బెంచ్‌మార్క్‌కు మార్చాల్సి ఉంటుంది. అసలు బెంచ్‌మార్క్ అందుబాటులో లేనప్పుడు ఏ బెంచ్‌మార్క్ వర్తిస్తుందో నిర్దేశిస్తూ రుణ ఒప్పందంలో ఒక ఫాల్‌బ్యాక్ నిబంధనను చేర్చవచ్చు. అంతర్గత లేదా బాహ్య బెంచ్‌మార్క్‌లకు అనుసంధానించబడిన అన్ని ప్రస్తుత రుణాలు మరియు అడ్వాన్సులను ఏప్రిల్ 1, 2029 నాటికి ఒకేసారి మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నిర్దేశిత ఫ్రేమ్‌వర్క్‌కు మార్చాలని ఆర్‌బిఐ ప్రతిపాదించింది. ఆర్ధిక సంస్థల నుంచి లోన్లు తీసుకునేవారికి ఈ రూల్స్ మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *