ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో పొటాషియం స్థాయిలను నియంత్రించే సామర్థ్యం శరీరానికి తగ్గుతుంది. ఈ పండులో పొటాషియం ఉండటం వల్ల కిడ్నీ రోగులపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే దీనిని పూర్తిగా మానేయాలని నిబంధనేమీ లేదు. వ్యాధి తీవ్రత, రక్తంలో పొటాషియం స్థాయిలు, వాడుతున్న మందుల ఆధారంగా మాత్రమే వైద్యులు సూచించిన పరిమిత పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా డ్రాగన్ ఫ్రూట్ మోతాదు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచే మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు ఈ పండును మితిమీరి తింటే, బ్లడ్ షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తమ డైట్ చార్ట్ ఆధారంగా వైద్యులు లేదా డైటీషియన్ల సలహా మేరకే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్తో అలర్జీ సమస్యలు రావడం అరుదే అయినప్పటికీ, కొంతమందిలో ఇది తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ పండు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద రావడం, పెదవులు లేదా నాలుక వాపు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జీగా గుర్తించాలి. కొందరిలో శ్వాస తీసుకోవడం కష్టమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి వారు డ్రాగన్ ఫ్రూట్కు పూర్తిగా దూరంగా ఉండటంతో పాటు, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.
ఇక గర్భిణులు, బాలింతల విషయానికి వస్తే సాధారణ ఆహార పరిమాణంలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు. అయితే దీనిని ఔషధాల రూపంలో గానీ, సప్లిమెంట్ల రూపంలో గానీ అధిక మోతాదులో వాడటం సురక్షితమా కాదా అనే అంశంపై ఇప్పటికీ తగినంత శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ పండును అతిగా కాకుండా సహజ సిద్ధంగా, సాధారణ మోతాదులోనే తీసుకోవడం మంచిది.
మొత్తంగా చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎవరూ తినకూడదనే నిషేధం ఏమీ లేదు. ఆరోగ్యవంతులకు ఇది అద్భుతమైన పోషకాహారం. కానీ అలర్జీలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. అదే సమయంలో కిడ్నీ, డయాబెటిస్ లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం తమ ఆరోగ్య స్థితిని బట్టి ఎంత మోతాదులో తినాలో నిపుణులను సంప్రదించి నిర్ణయించుకోవడమే సరైన మార్గం.




