మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో ల్యాండ్మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నామని, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై టెహ్రాన్ ఎనిమిది క్షిపణులతో దాడి చేసినందుకు ప్రతిస్పందనగానే తాజా దాడులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. “ఇరాన్పై అతిపెద్ద దాడి ఇంకా జరగాల్సి ఉంది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాబోయే దాడిలో ఇరాన్లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు IRGC కూడా అమెరికాకు ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. తాజా వైమానిక దాడులకు అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై ప్రతీకార చర్యలు తప్పవని ప్రకటించింది. త్వరలోనే తమ స్పందన ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో IRGC స్థావరాలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం ఖేష్మ్, జాస్క్, సిరిక్, చబహార్, బందర్ అబ్బాస్, కొనరాక్, మినాబ్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్న దశలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం ఈ వాదనలను తిరస్కరిస్తోంది. హోర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలతో ప్రపంచంలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇక్కడ నౌకాయానం అంతరాయం కలిగితే ప్రపంచ చమురు సరఫరా, ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అమెరికా-ఇరాన్ ఘర్షణ తదుపరి దశకు చేరుతుందా? అన్న ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..