Headlines

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. రాహుల్, కేజ్రీవాల్ ఆరోపణలకు కిషన్ రెడ్డి కౌంటర్ | G Kishan Reddy Counter to Rahul Gandhi and Kejriwal, says Congress began E10, floated global tender for ethanol

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. రాహుల్, కేజ్రీవాల్ ఆరోపణలకు కిషన్ రెడ్డి కౌంటర్ | G Kishan Reddy Counter to Rahul Gandhi and Kejriwal, says Congress began E10, floated global tender for ethanol


Ethanol Blending: ఇథనాల్ బ్లెండింగ్ (E10) విధానంపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే (2012-2013 నాటి గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం) ఈ ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రారంభమైందని గుర్తు చేశారు. నాటి విధానాల కాలక్రమాన్ని గుర్తుచేస్తూ, అప్పట్లో విదేశాల నుంచి ఇథనాల్ కోసం ఎదురుచూసిన పరిస్థితి నుండి నేడు దేశీయంగా రైతులు అవసరానికి మించి ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని ఆయన వివరించారు. రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా (X – ఎక్స్) ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇథనాల్ విధానంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ అబద్ధాలు చెప్తుంటే, రాహుల్ గాంధీ తన సొంత పార్టీ గతంలో చేసిన నిర్ణయాలను మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న విమర్శలు నిజానికి కాంగ్రెస్ హయాంలో జరిగిన వైఫల్యాలనే ఎత్తిచూపుతున్నాయన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది?

22 నవంబర్ 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశమై 30 జూన్ 2013 నాటికి దేశవ్యాప్తంగా 5% ఇథనాల్ బ్లెండింగ్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అలాగే 2023 జనవరి 2న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, బిఐఎస్ (BIS) నిబంధనల ప్రకారం 10% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విక్రయించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (OMCs) ఆదేశించింది.

ఆ సమయంలో దేశానికి 140.4 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం కాగా, భారతీయ ఉత్పత్తిదారులు కేవలం 55 కోట్ల లీటర్లను మాత్రమే అందించగలిగారు. చివరకు సరఫరా పూర్తయిన పరిమాణం కేవలం 39.8 కోట్ల లీటర్లకు పడిపోయింది. ఈ కొరతను అధిగమించడానికి జనవరి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం 82.03 కోట్ల లీటర్ల ఇథనాల్ కోసం గ్లోబల్ టెండర్ (విదేశీ టెండర్) పిలిచిందని కిషన్‌ రెడ్డి వివరించారు. మన స్వదేశీ రైతుల నుండి సేకరించే సామర్థ్యాన్ని పెంచలేక, విదేశీ మార్కెట్‌పై కాంగ్రెస్ ఆధారపడిందని, ఈ రోజు టీవీల్లో అబద్దాలు చెబుతున్న రాహుల్ గాంధీ, నాడు తమ ప్రభుత్వం విదేశీ టెండర్లు ఎందుకు పిలవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గోవా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని E20 ఇథనాల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అమెరికా నుంచి మిగులు ఇథనాల్‌ను భారత్‌లో రుద్దుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంధన అవసరాల కోసం ఇథనాల్‌ను దిగుమతి చేసుకోవడాన్ని భారత్ మే 2019లోనే పూర్తిస్థాయిలో నిషేధించిందన్నారు. ఈ నిషేధం పట్ల అమెరికా ప్రభుత్వం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది అసమాన వాణిజ్య విధానం అని పేర్కొంది. పెట్రోల్ బ్లెండింగ్ కోసం ఉపయోగిస్తున్న ప్రతి లీటరు ఇథనాల్‌ను కేవలం స్వదేశీ రైతులు, ఉత్పత్తిదారుల నుంచే సేకరిస్తున్నామని ఆగస్టు 6న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించింది. కేజ్రీవాల్ తక్షణమే ఈ తప్పుడు ప్రచారాన్ని నిలిపివేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

2013లో కాంగ్రెస్ హయాంలో ఇథనాల్ కోసం విదేశాల ముందు చేతులు చాచాల్సి వచ్చిందని, కానీ ఈనాడు మన భారతీయ రైతులు దేశ అవసరాల కంటే రెట్టింపు ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్ ధరల సంస్కరణలు, దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలు, డిస్టిలరీ సామర్థ్యం పెంచడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని చెరకు రైతులు అలాగే మొక్కజొన్న, ఇతర ధాన్యాల రైతులు తమ ఆదాయం పెరగడానికి కారణం ఎవరో స్పష్టంగా తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ కొత్త విదేశీ కుట్ర కథలు అల్లేముందు భారత్ విధించిన దిగుమతి నిషేధంపై ఇతర దేశాలు ఎందుకు నిరసన తెలుపుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *