ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి, అవసరమైనప్పుడు బయటకు తీసి వేడి చేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? ఆయుర్వేదం ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తోంది. ఆయుర్వేదం ప్రకారం తాజాగా తయారు చేసిన, వెచ్చగా ఉన్న ఆహారం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది. ఆహారాన్ని తాజాగా తీసుకోవడం వల్ల దాని సహజ గుణాలను కాపాడుకోవచ్చని ఆయుర్వేదం భావిస్తుంది.
ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తిరిగి వేడి చేయడం వల్ల దాని సహజ లక్షణాల్లో మార్పులు రావచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ముఖ్యంగా ఒకసారి చల్లార్చి, మళ్లీ వేడి చేసి, తిరిగి చల్లార్చే విధంగా ఆహారాన్ని పదేపదే వేడి చేయడం మంచిది కాదని సూచిస్తుంది. మళ్లీ మళ్లీ వేడి చేసిన ఆహారం జీర్ణం కావడానికి భారంగా మారే అవకాశముంది. దీనివల్ల జీర్ణశక్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ముఖ్యంగా తాలించిన పదార్థాలు, అన్నం, పప్పులు, వండిన కూరలను పదేపదే వేడి చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఆయుర్వేదం మేరకు ఒకసారి అవసరమైనంత మాత్రమే వేడి చేసుకుని తినడం మంచిది.
ఫ్రిజ్లోని ఆహారం తినాలంటే..
ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తినాల్సి వస్తే, అవసరమైన పరిమాణాన్ని మాత్రమే బయటకు తీసి ఒక్కసారి సరిగ్గా వేడి చేసుకుని తినడం మంచిది. ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం వంటి వాటిని నివారించాలి.
అయితే ఫ్రిజ్లో పెట్టిన ప్రతి ఆహారం తప్పనిసరిగా ప్రమాదకరమని చెప్పలేం. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, శుభ్రత పాటించడం, ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా ఉండటం వంటి ఆధునిక ఆహార భద్రతా పద్ధతులు కూడా ముఖ్యమే. సరైన నిల్వ, పరిశుభ్రత పాటిస్తే అనేక రకాల ఆహారాలను సురక్షితంగా తీసుకోవచ్చు.