అది బీహార్…అక్కడ ఏమైనా జరగవచ్చు.. ఈ మాట మరోసారి నిజమవుతోంది. బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాకు చెందిన ధనస్సుధన్ ప్రసాద్ ఇటీవలే సరికొత్త మహీంద్రా స్కోర్పియో కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ ప్రాంతంలో వాహనాల దొంగతనాలు ఎక్కువవుతుండటంతో ఆయనలో భయం మొదలైంది. రోడ్డుపై లేదా ఇంటి బయట పార్క్ చేస్తే దొంగలు ఎక్కడ ఎత్తుకెళ్తారోనని తీవ్రంగా ఆందోళన చెందారు. దీనికి పరిష్కారంగా తన కారును ఎవరూ చేరుకోలేని భవనం పైకప్పుపై ఉంచాలని నిశ్చయించుకున్నారు.
ధనస్సుధన్ ప్రసాద్ ప్రస్తుతం మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కారును ఆ భవనం పైకి చేర్చడం సులభమైన విషయమేమీ కాదు. అందుకోసం ఆయన ఒక భారీ క్రేన్ను రప్పించారు. ఎంతో జాగ్రత్తగా స్కోర్పియో కారును క్రేన్ సహాయంతో మూడో అంతస్తు పైకప్పు మీదికి చేర్చారు. ఈ ప్రక్రియ మొత్తానికి ఆయన దాదాపు రూ. 1,00,000 వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇంటి కప్పుపై మెరుస్తున్న నల్లటి స్కోర్పియో కారును చూసి చుట్టుపక్కల ప్రజలు, బాటసారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విచిత్ర పార్కింగ్ను చూడటానికి ప్రజలు ఆయన ఇంటి వద్దకు గుమిగూడుతున్నారు. కొందరు దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దొంగల భయానికి ఇది నిజంగా మాస్టర్మైండ్ ప్లాన్ అని కొందరు ప్రశంసిస్తుంటే, ఇంత ఖర్చు పెట్టి పైకి ఎక్కించారు సరే, మళ్లీ రోజూ బయటకు తీసి నడపాలంటే క్రేన్ తేవాలా? అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, తన కారు భద్రత కోసం ఈ యజమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..