
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి చంపేయాలని, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి పంపిన మెసేజ్ మర్డర్ మిస్టరీని ఛేదించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లను బాధితుడు పోలీసులకు అందజేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై డోర్నకల్లు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్లో నివాసముంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువతితో అతనికి వివాహం కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జూలై నెల 27వ తేదీన భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు తన అన్నను తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అనుమానితుడు తనను వెంబడించినట్లు తెలిపాడు. అనంతరం భార్య మొబైల్ ఫోన్ను పరిశీలించగా ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటపడినట్లు పేర్కొన్నాడు.
ఆ చాటింగ్లో భర్తను ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలా కనిపించే విధంగా హత్య చేయించాలని ప్రియుడిపై ఒత్తిడి చేసినట్లు ఉన్న సందేశాలను బాధితుడు పోలీసులకు సమర్పించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ భార్యతో పాటు ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా డోర్నకల్లు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అనంతరం బాధితుడు అక్కడ కూడా మరోసారి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిందని, చట్టపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని గ్రామీణ పోలీసులు తెలిపారు. కేసులో సమర్పించిన డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..