Headlines

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. బీసీసీఐ పిలుపుతో 33 ఏళ్ల వయసులో లక్కీ ఛాన్స్.. ఎవరంటే? | Saransh jain team india test squad selection sri lanka tour mp all rounder

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. బీసీసీఐ పిలుపుతో 33 ఏళ్ల వయసులో లక్కీ ఛాన్స్.. ఎవరంటే? | Saransh jain team india test squad selection sri lanka tour mp all rounder


శ్రీలంక పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన టెస్ట్ స్క్వాడ్‌లో ఎవరూ ఊహించని సరికొత్త మార్పు చోటుచేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం బారిన పడి తొలి టెస్టుకు దూరం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే అరుదైన అవకాశం సారాన్ష్ జైన్‌కు దక్కింది. దాదాపు పదేళ్లుగా మధ్యప్రదేశ్ జట్టుకు దేశవాళీ క్రికెట్లో చెమటోడుస్తున్న ఈ వెటరన్ ఆటగాడికి జీవితంలో ఇదే అతిపెద్ద బహుమతి. యువ ఆటగాళ్లతో నిండిన ప్రస్తుత భారత జట్టులో 33 ఏళ్ల వయసున్న ఓ దేశవాళీ ప్లేయర్‌కు స్థానం దక్కడం సాధారణ విషయం కాదు. ఈ వార్త బయటకు రాగానే అసలు ఈ సారాన్ష్ జైన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని నెటిజన్లు ఆసక్తిగా గూగుల్ చేయడం మొదలుపెట్టారు.

దశాబ్దపు పోరాటం.. అదిరిపోయే ఫస్ట్ క్లాస్ రికార్డులు..

2014లో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన సారాన్ష్ జైన్‌కు ఆట పట్ల ఎనలేని అంకితభావం ఉంది. అప్పటినుంచి మధ్యప్రదేశ్ జట్టుకు ప్రధాన స్పిన్ ఆల్ రౌండర్‌గా అద్భుతమైన సేవలు అందిస్తున్నాడు. సెంట్రల్ జోన్, రెస్టాఫ్ ఇండియా జట్లకు సైతం ప్రాతినిధ్యం వహించిన సుదీర్ఘ అనుభవం అతడి సొంతం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 181 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటి 2223 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టుకు అవసరమైన కీలక పరుగులు రాబట్టడం ఇతని స్పెషాలిటీ. ప్రముఖ దేశవాళీ కోచ్ చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో అతని ఆటతీరు పూర్తిగా పదునెక్కింది. 2022లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ ఓ కీలక సభ్యుడు. ముంబైతో చెన్నై వేదికగా జరిగిన ఆ చారిత్రక ఫైనల్లో బంతితో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు.

ఇది కూడా చదవండి: ముగిసిన జింబాబ్వే సిరీస్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

ఇవి కూడా చదవండి



కొడుకు కోసం క్యాన్సర్ బాధను దిగమింగుకున్న తండ్రి..

సారాన్ష్ ఎదుగుదల వెనుక ఓ హృదయ విదారకమైన కన్నీటి గాథ దాగుంది. అతని తండ్రి సుబోధ్ జైన్ కూడా మాజీ క్రికెటరే కావడం విశేషం. మధ్యప్రదేశ్ తరపున తొమ్మిది రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆయన రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. తానూ దేశం తరపున ఆడాలని ఆయన ఎన్నో కలలు కన్నాడు. ఆ కల నెరవేరకపోవడంతో తన కొడుకు ద్వారా దాన్ని సాకారం చేసుకోవాలనుకున్నాడు. కొడుకు కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అని తన క్యాన్సర్ ఆపరేషన్ విషయాన్ని కూడా కొడుక్కి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సారాన్ష్ జైన్‌కు తన తండ్రి సర్జరీ విషయం కనీసం తెలియదు. తిరిగి వచ్చాకే తండ్రి ముఖానికి ఆపరేషన్ జరిగిందన్న నిజాన్ని జీర్ణించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సారాన్ష్ ఓ ఇంటర్వ్యూలో పంచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

లంక గడ్డపైనే సత్తా చాటి.. ఐపీఎల్‌కు దిమ్మతిరిగే షాక్!

తాజాగా ఇండియా-ఏ తరపున శ్రీలంక పర్యటనకు వెళ్లిన సారాన్ష్ జైన్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు సాధించి, బంతితో ఆరు వికెట్లు పడగొట్టి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతోనే జాతీయ సెలెక్టర్ల కంట్లో పడ్డాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశవాళీలో ఇంత అద్భుతంగా రాణిస్తున్నా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇతడిని ఏమాత్రం పట్టించుకోలేదు. 2024 నుంచి 2026 వరకు ప్రతిసారి వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఎవరూ కొనుగోలు చేయలేదు. డబ్బులు కురిపించే లీగ్‌లో చోటు దక్కలేదని కుంగిపోకుండా తన ఆటనే నమ్ముకుని కష్టపడ్డాడు. ఐపీఎల్ దయాదాక్షిణ్యాలతో పనిలేకుండా కేవలం దేశవాళీ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి అడుగుపెట్టిన అరుదైన ఆటగాడిగా సారాన్ష్ జైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

ఆలస్యంగానైనా 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టు తలుపులు తట్టడం ఓ అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. నిజాయితీగా కష్టపడితే వయసుతో సంబంధం లేకుండా గుర్తింపు వస్తుందని సారాన్ష్ జైన్ ఎందరో యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. శ్రీలంక గడ్డపై జరగనున్న ఈ సిరీస్‌లో అతను మైదానంలోకి దిగి ఎలా అదరగొడతాడో చూడాలని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *