Ricky Ponting Slams Australia Team Historic Loss: సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురైన ఘోర పరాభవం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన చారిత్రక ఓటమితో కంగారూల మాజీ దిగ్గజాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రిక్కీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ లాంటి మాజీలు ప్రస్తుత జట్టు తీరుపై నిప్పులు చెరిగారు. ఏకంగా జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బంగ్లా సంచలనం.. బద్దలైన ఆసియా జట్ల రికార్డులు..
క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టుకు ఉన్న ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ సొంతగడ్డపై వారిని ఓడించడం ఏ అగ్రశ్రేణి జట్టుకైనా ఓ పీడకల లాంటిదే. అలాంటి కఠినమైన పిచ్లపై బంగ్లాదేశ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రీడా లోకంలో పెను ప్రకంపనలు రేపుతోంది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సృష్టించిన సునామీకి ఆస్ట్రేలియా పరువు గంగపాలైంది. మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్ అద్భుత బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!
ఇవి కూడా చదవండి
ఫలితంగా బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో బంగ్లా జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియా గడ్డపై అతి తక్కువ మ్యాచ్ల్లోనే తొలి విజయం సాధించిన ఆసియా జట్టుగా రికార్డులకెక్కింది. కంగారూల ఇలాకాలో బోణీ కొట్టేందుకు బంగ్లాదేశ్కు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే పట్టాయి.
గతంలో పాకిస్థాన్ తమ ఏడో మ్యాచ్లో తొలి గెలుపును అందుకోగా, భారత్ 12వ మ్యాచ్లో తొలి విజయం సాధించింది. ఇక శ్రీలంక ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడినా ఆసీస్ గడ్డపై ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేకపోయింది. ఈ లెక్కలు చూస్తే బంగ్లాదేశ్ సాధించిన ఘనత ఎంత గొప్పదో సులభంగా అర్థమవుతుంది.
అత్యంత అవమానకరం.. పాంటింగ్ ఫైర్
సొంత ప్రేక్షకుల మధ్య పసికూన చేతిలో ఓడిపోవడంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆస్ట్రేలియా క్రికెట్కు ఇదొక అత్యంత అవమానకరమైన ఓటమని అభివర్ణించాడు. పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేస్తూ, జట్టులో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టాడు.
సాధారణంగా తాను ఆటగాళ్లను తప్పించే విధానానికి వ్యతిరేకమని పాంటింగ్ స్పష్టం చేశాడు. నాయకుడిగా జట్టును ఎప్పుడూ ఏకతాటిపై నడిపించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు. పరిస్థితులు పూర్తిగా చేయిదాటితే తప్ప ఆటగాళ్లపై వేటు వేయాలని తాను కోరుకోనని తెలిపాడు.
ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!
డార్విన్ టెస్టుకు ముందే ఆసీస్ ఓపెనర్, నంబర్ 3 స్థానాల్లో మార్పులు చేసినా పెద్దగా నష్టం ఉండదని తాను భావించినట్లు పాంటింగ్ గుర్తుచేశాడు. తాజా పరాభవంతో జట్టు ప్రక్షాళన ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
హేడెన్ సూచనలు.. బ్యాటింగ్ ఆర్డర్ మారాల్సిందే..!
మరో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ సైతం బ్యాటింగ్ ఆర్డర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు సామ్ కోన్స్టాస్, మ్యాట్ రెన్షాలకు వెంటనే తుది జట్టులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం బ్యాటింగ్ లైనప్ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించాడు.
డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను ఓపెనర్గా పంపడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదని హేడెన్ అభిప్రాయపడ్డాడు. అతడికి ఐదో స్థానం కచ్చితంగా సరిపోతుందని సూచించాడు. అదే సమయంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఐదో నంబర్లో ఆడించడం తనకు అస్సలు నచ్చలేదని స్పష్టం చేశాడు.
వరుస విమర్శల నడుమ ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 22 నుంచి మెకే లోని గ్రేట్ బారియర్ రీఫ్ ఎరీనా వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కంగారూలు ఎలా బదులిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..