చిన్న పిల్లలకు సీసా ద్వారా పాలు తాగించేటప్పుడు తల్లిదండ్రులు తెలియక చేసే కొన్ని పొరపాట్లు శిశువుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ప్రముఖ పిడియాట్రీషియన్స్ అభిప్రాయం ప్రకారం.. పాలు తాగించేటప్పుడు సీసాను సరైన కోణంలో ఉంచకపోవడం వల్ల పిల్లల కడుపులోకి గాలి వెళ్లి కడుపునొప్పి, గ్యాస్, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యమైన 4 ప్రధాన పొరపాట్లను నివారిస్తే పిల్లల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటంటే..
1. పాలు తాగించే సరైన పొజిషన్ పాటించకపోవడం
బాటిల్ పాలు ఇచ్చేటప్పుడు సీసాను సరైన యాంగిల్లో పట్టుకోవాలి. సీసాను పూర్తిగా సమాంతరంగా ఉంచితే, నిపుల్ భాగంలోకి పాలు మాత్రమే కాకుండా గాలి కూడా చేరుతుంది. పాలు తాగేటప్పుడు ఆ గాలి కూడా పిల్లల కడుపులోకి వెళ్లి గ్యాస్, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులకు దారితీస్తుంది. అందుకే నిపుల్ భాగం ఎల్లప్పుడూ పాలతో నిండి ఉండేలా బాటిల్ను స్వల్ప కోణంలో పట్టుకోవాలి.
2. పాలు తాగాక తేన్పు తీర్పించకపోవడం
చాలామంది తల్లిదండ్రులు పాలు తాగించడం పూర్తయిన వెంటనే మంచంపై పడుకోబెడతారు. ఇది చాలా పెద్ద పొరపాటు. పాలు తాగిన ప్రతిసారి శిశువును భుజంపై వేసుకుని వీపుపై సున్నితంగా నిమిరి తేన్పు తీర్చాలి. ఇలా చేయడం వల్ల పాలు తాగేటప్పుడు కడుపులోకి వెళ్లిన గాలి బయటకు వచ్చి పాలు సులభంగా జీర్ణమవుతాయి.
ఇవి కూడా చదవండి
3. బాటిల్ నోట్లో ఉంచి పడుకోబెట్టడం
పిల్లలు త్వరగా నిద్రపోవాలని కొంతమంది బాటిల్ను నోట్లో ఉంచి అలాగే పడుకోబెడతారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. పాలు చెవి నాళాల్లోకి వెళ్లి తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు రావచ్చు. నోట్లోనే పాలు ఉండిపోవడం వల్ల చిన్న వయస్సులోనే పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. పాలు శ్వాసనాళాల్లోకి వెళ్లి ఊపిరాడకపోయే ప్రమాదం కూడా ఉంది.
4. బలవంతంగా పాలు తాగించడం
బాటిల్లో ఉన్న పాలు మొత్తం ఖాళీ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు బలవంతంగా తాగించకూడదు. పాలు చాలని పిల్లలు సంకేతాలు ఇచ్చినప్పుడు వెంటనే పాలు తాగించడం ఆపేయాలి. బలవంతం చేస్తే పిల్లలు వాంతులు చేసుకునే అవకాశం ఉంది. పిల్లలకు పాలు తాగించే సమయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వారి జీర్ణక్రియ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..