నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో కొన్నేళ్ల క్రితం సంప్రదాయ పద్ధతిలో ఓ కుటుంబం కోడే దూడను ఆంబోతుగా వదిలిపెట్టారు. ఏళ్లుగా స్వేచ్ఛగా తిరుగుతూ అందరి ప్రేమాభిమానాలు పొందిన ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామ దేవతకు ప్రతీకగా భావించే ఈ దేవుని కోడె మరణంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే చిన్నా, పెద్దా తేడా లేకుండా గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
తమ ఇంట్లో వాళ్లు పోయినంత ఆవేదనకు గురయ్యారు. మృతిచెందిన ఆంబోతును పూలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. ముందు బాజా భజంత్రీలు, డప్పులు, డీజే సౌండ్లు… మధ్యలో కోలాటాలు… భక్తి గీతాలతో గ్రామమంతా మార్మోగింది. మహిళలు హారతులు పట్టారు. ఊరంతా కలిసి హిందూ సాంప్రదాయ బద్దంగా ఖననం చేసి ఘనంగా విడ్కోలు పలికారు. గ్రామస్థులు దేవుని కోడెకు ఇదే మా కృతజ్ఞత అంటూ నివాళులర్పించారు. మూగజీవుల పట్ల తమకున్న ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి చాటిచెప్పారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఆంబోతు అంత్యక్రియలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనాలు పెట్టారు. దాదాపు ఓ గ్రామస్థాయి నాయకుడు మరణిస్తే ఎంత మర్యాద, గౌరవంగా సాగనంపుతారో అంతే చేశారు.
ఇవి కూడా చదవండి
నేటి కాలంలో మనుషులకే అంతిమ యాత్రకు నలుగురు దొరకడం కష్టమవుతున్న వేళ… ఒక మూగజీవిని దేవుని ప్రతిరూపంగా భావించి ఊరంతా కలిసి కన్నీటి వీడ్కోలు పలకడం… కొర్లపహాడ్ గ్రామ సంస్కృతికి, విశ్వాసానికి అద్దం పట్టింది. దేవుని కోడె వెళ్లిపోయింది.ఇది గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబాలకు, పశువులకు ఉండే అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..