Headlines

దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్ | Worried About Car Theft, Bihar Man Parks Scorpio on Rooftop Before Leaving for Abroad; Video Goes Viral


బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్‌ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా వాహనాన్ని సురక్షిత పార్కింగ్‌లో ఉంచడం, బంధువుల వద్ద అప్పగించడం వంటి మార్గాలను ఎంచుకుంటారు. కానీ ఈ యజమాని మాత్రం ఏకంగా క్రేన్‌ సాయంతో కారును ఇంటి పైకప్పుపైకి ఎక్కించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బిహార్‌లోని ఖచ్చితమైన ప్రాంతం, వాహనం యజమాని పేరు వంటి వివరాలు వెల్లడికాలేదు. అలాగే స్కార్పియో ఎంతకాలంగా పైకప్పుపై ఉంటుందనే విషయం, ఈ ప్రక్రియకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్నదీ స్పష్టంగా తెలియరాలేదు.

వాహనాన్ని ఇంటి పైకప్పుపైకి క్రేన్‌తో ఎత్తడం అంత సులభమైన విషయం కాదు. ఒక ఎస్‌యూవీ బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ నివాస భవనం పైకప్పు ఇంతటి బరువును మోయడానికి, అది కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమయ్యే బరువును భరించేందుకు డిజైన్ చేసి ఉండకపోవచ్చు. అంతేకాకుండా క్రేన్‌ ద్వారా వాహనాన్ని పైకి ఎత్తే సమయంలో కూడా ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం సరైన లిఫ్టింగ్ పాయింట్లు, శిక్షణ పొందిన క్రేన్ ఆపరేటర్లు, తగిన భద్రతా ఏర్పాట్లు అవసరం. కారు తిరిగి కిందికి దించేటప్పుడు కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు వాహనం ఎక్కువకాలం గురికావడం, పైకప్పుపైకి వెళ్లేందుకు సరైన యాక్సెస్ లేకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి



విదేశాలకు, సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లే వాహన యజమానులు ఇలాంటి ప్రమాదకర మార్గాలను అనుసరించకుండా సురక్షితమైన కవర్డ్ పార్కింగ్, నమ్మకమైన కేర్‌టేకర్, వీల్ లాక్స్, GPS ట్రాకింగ్, ఇన్సూరెన్స్, సీసీ కెమెరాలు వంటి భద్రతా చర్యలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో మహీంద్రా స్కార్పియోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కార్పియో-ఎన్ ధర ఎంచుకునే వేరియంట్, ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్‌ను బట్టి ఎక్స్‌షోరూమ్‌లో రూ.13.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ అందుబాటులో ఉంది. అధిక స్పెసిఫికేషన్ వేరియంట్లలో ఈ ఇంజిన్ గరిష్ఠంగా 132 hp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్‌లోని కొన్ని వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ సదుపాయం కూడా లభిస్తుంది. అయితే బిహార్‌లో స్కార్పియోను ఇంటి పైకప్పుపైకి ఎక్కించిన ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాహనం, ప్రస్తుతం విక్రయిస్తున్న స్కార్పియో-ఎన్‌ కాదని, స్కార్పియో క్లాసిక్‌గా కనిపిస్తోంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *