Headlines

నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ | Woman’s Mummified Body Found Sitting in Front of TV 42 Years After Her Death

నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్ | Woman’s Mummified Body Found Sitting in Front of TV 42 Years After Her Death


సమాజంలో పెరిగిపోతున్న ఒంటరితనం, మనుషుల మధ్య తగ్గుతున్న సంబంధాలకు అద్దం పట్టే అతిపెద్ద విచారకరమైన ఘటన ఇది. ఒక మహిళ తన ఇంట్లో టీవీ చూస్తూ, చేతిలో టీ కప్పు పట్టుకుని కూర్చున్న భంగిమలోనే ప్రాణాలు విడిచింది. కానీ, విచారకరమైన విషయమేమిటంటే, ఆమె మరణించిన విషయం ఏకంగా 42 సంవత్సరాల పాటు ఎవరికీ తెలియలేదు. ఆమె శరీర భాగాలు ఇంట్లోనే మమ్మీలా మారిపోగా, బయటి ప్రపంచం మాత్రం దశాబ్దాల పాటు యథావిధిగా సాగిపోయింది. గతంలో ఈ వార్త విపరీతంగా వైరల్‌ గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ హల్‌చల్ చేస్తున్న ఈ భయాందోళనకర ఘటన క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగింది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

1924లో జన్మించిన హెడ్విగా గోలిక్ అనే మహిళను ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని పొరుగువారు 1966లో చివరిసారిగా చూశారు. ఆ తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదు. ఆమె నగరం విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటుందని చుట్టుపక్కల వారు భావించారు. దాంతో ఎవరూ ఆమె ఇంటి తలుపు తట్టే ప్రయత్నం చేయలేదు, ఆమె గురించి వెతికేందుకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. సరిగ్గా 2008లో ఆ అపార్ట్‌మెంట్ ఆస్తి హక్కులకు సంబంధించిన ఒక చట్టపరమైన వివాదం తలెత్తింది. దీంతో అధికారులు, పోలీసులు సదరు ప్లాట్ తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. తలుపు తెరవగానే లోపల ఉన్న దృశ్యం చూసి అధికారుల గుండెలు ఆగిపోయినంత పని అయింది.

ఇవి కూడా చదవండి



ఆ గదిలో ప్రతీ వస్తువు కాలం ఆగిపోయినట్లుగా దుమ్ము పట్టి ఉంది. అతిపెద్ద షాకింగ్ విషయం ఏమిటంటే… హెడ్విగా గోలిక్ తన అభిమాన కుర్చీపై కంబళి కప్పుకుని కూర్చుని ఉంది. ఆమె శరీర భాగాలన్నీ ఎండిపోయి మమ్మీ రూపంలో మారాయి. ఆమె పక్కనే ఒక టీ కప్పు, ఎదురుగా టీవీ ఉన్నాయి.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… హెడ్విగా 1966లోనే ఒక రోజు టీవీ చూస్తూ, టీ తాగుతున్న సమయంలో గుండెపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యతో హఠాత్తుగా మరణించి ఉండవచ్చని తేలింది. విపరీతమైన ఒంటరితనం, కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె మరణం దశాబ్దాల పాటు ఎవరికీ తెలియకుండా పోయింది. పొరుగువారి అపార్థం, నిర్లక్ష్యం వల్ల ఏకంగా 42 ఏళ్ల పాటు ఆమె మృతదేహం గదిలోనే ఉండిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన సామాజిక సంబంధాలు, మానవీయ విలువల క్షీణతకు అద్దం పడుతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *