నేపాల్లో సంభవించిన వర్షాలు, భయంకరమైన వరదల దాటికి జనజీవనం స్తంభించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వరద నీరు ముంచెత్తడంతో ఏకంగా 11 బ్యాంకులకు చెందిన 17 శాఖలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి అనేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ భవనాలు నీట మునిగాయి. బ్యాంకుల లోపలికి నడుముల్లోతు నీరు చేరడంతో కంప్యూటర్లు, సర్వర్లు, ముఖ్యమైన కాగితాలు తడిసిపోయాయి. అనేక చోట్ల బ్యాంక్ లాకర్లు, క్యాష్ కౌంటర్లు నీటిలో మునిగిపోయాయి. దీనితో లాకర్లలో ఉన్న నగదు, విలువైన పత్రాలు మరియు బంగారం నీటి పాలు అయ్యాయేమోనని స్థానిక ప్రజలు, ఖాతాదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఎంత సొమ్ము నష్టం వాటిల్లింది?:
వరద దాటికి కొట్టుకుపోయిన నగదు, ఆస్తి నష్టం ఎంతనేది నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఇంకా అధికారికంగా అంచనా వేయాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంక్ అధికారులకు, రెస్క్యూ టీమ్లకు ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గం సరిగ్గా లేకపోవడంతో పూర్తిస్థాయి నష్టాన్ని లెక్కించలేకపోతున్నారు. కొన్ని శాఖలలోని స్ట్రాంగ్ రూమ్లు జలమయం కావడంతో కోట్లాది రూపాయల నేపాలి కరెన్సీ తడిసిపోయి దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు.
నిలిచిపోయిన ఏటీఎంలు, బ్యాంకింగ్ సేవలు:
17 బ్యాంక్ శాఖలు పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరడం, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఏటీఎంలలో డబ్బులు లేక, ఉన్నా యంత్రాలు పనిచేయక ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో నగదు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి
పునరుద్ధరణ చర్యలు:
రహదారులు పునరుద్ధరించబడిన వెంటనే ఆయా బ్యాంకుల్లోని సేఫ్లు, లాకర్ల పరిస్థితిని పరిశీలిస్తామని బ్యాంకర్లు తెలిపారు. ఖాతాదారుల డిపాజిట్లు, డేటా డిజిటల్ రూపంలో సురక్షితంగానే ఉన్నాయని, పరిస్థితి చక్కబడగానే ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..