Headlines

ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. 3 నెలలుగా కానరాని ఆచూకీ..! హైకోర్టు సీరియస్ | Three Months On, Missing Girl Still Untraced; Andhra Pradesh High Court Rebukes Police


గుంటూరు, సెప్టెంబర్ 4: గుంటూరు నగరంలోని పట్టాభిపురం పిఎస్ పరిధిలో నివాసం ఉండే బాలిక ప్రవేటు స్కూల్లో పదో తరగతి చదువుతుంది. బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో కొన్నాళ్లు క్రితం పర్చూరుకు చెందిన షేక్ జాన్ సైదా పరిచయం అయ్యాడు. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ లో వేసుకున్నాడు. జూన్ 9వ తేదిన ట్యూషన్ నుండి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్వహించే షాపు వద్దకు వెళ్లి వస్తానని అమ్మమ్మకు చెప్పి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన బాలికను జాన్ సైదా బైక్ పై తీసుకెళ్లిపోయాడు. బాలిక తనతో పాటు బంగారు ఆభరణాలు, నగదు కూడా తీసుకెళ్లింది. ఇదేమీ తెలియని తల్లిదండ్రులు మొదట బాలిక కోసం వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సిసి కెమెరా విజువల్స్ సాయంతో జాన్ సైదా బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారు. మూడు నెలల గడుస్తున్న ఆచూకీ లేకపోవడంతో బాలిక తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు అవుతున్నా ఎందుకు ఆచూకీ కనిపెట్టాలేకపోయారంటూ ప్రశ్నించింది. దీంతో సిట్ ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసులు సోమవారం నాటికి బాలికను తీసుకొస్తామని హై కోర్టు కు చెప్పారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చారు.

ఇవి కూడా చదవండి



అయితే బాలికను తీసుకెల్లిన జాన్ సైదా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకూ పది సిమ్ లను మార్చాడు. ఎక్కడా ఆన్ లైన్ పేమేంట్స్ చేయడం లేదు. బాలిక దగ్గరున్న నగదును ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారు. గుంటూరు నుండి వెళ్లిన వీరిద్దరూ మొదట పర్చూరు వెళ్లి అక్కడ నుండి నెల్లూరు, కోయంబత్తూరు, పాలక్కాడ్ వెళ్లినట్లు తేల్చారు. అక్కడ నుండి సికింద్రాబాద్ కు మకాం మార్చినట్లు గుర్తించిన పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వివిధ పేర్లతో ఖాతాలు తెరిచిన యువకుడు వాటి ద్వారా మెస్సేజ్ లు పంపుతున్నట్లు గుర్తించారు. కొద్దీ రోజుల క్రితం మీకు చేతనైతే పట్టుకోవాలంటూ ఇన్ స్టా ద్వారా జాన్ సైదా బాలిక తల్లిదండ్రులకు మెస్సెజ్ పంపించాడు. ఆ ఆధారంగా ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాటికి వీరి అడ్రస్ కనుక్కొని బాలికను తీసుకొచ్చి కోర్టు ముందుంచాల్సిన నేపధ్యంలో ఏం జరుుగుతుందోన్న ఉత్కంఠ గుంటూరు నగరంలో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *