Headlines

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే.. | Sangareddy: Man Takes his Wife life After Family Dispute, Dumps Body Near Dargah and Surrenders

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే.. | Sangareddy: Man Takes his Wife life After Family Dispute, Dumps Body Near Dargah and Surrenders


సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. తరచూ గొడవలు జరగడంతో మనస్తాపానికి గురైన ఇర్ఫానా గత ఆరు నెలలుగా తన పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఇరువురికి సర్దిచెప్పడంతో, వారం రోజుల క్రితమే ఆమె భర్త వద్దకు తిరిగి వచ్చింది.

అయితే సంసారం మళ్లీ సవ్యంగా సాగుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న సమయంలో మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఆవేశానికి లోనైన సయ్యద్ ముల్తాన్ ఇంట్లో ఉన్న కత్తితో ఇర్ఫానాపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శరీరంపై పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా ఇర్ఫానా మృతదేహాన్ని గ్రామ సమీపంలోని దర్గా వద్ద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తెల్లవారుజామున నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

వీడియో : గమనిక.. కలిచివేసే దృశ్యాలు

నిందితుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం వంటి అంశాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామ పెద్దల సమక్షంలో రాజీ కుదిరి కేవలం వారం రోజులు కూడా గడవకముందే ఈ దారుణం జరగడం గ్రామస్థులను కలిచివేసింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *