యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
220 చేపలపై విస్తృత అధ్యయనం
ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్తో పాటు ఢిల్లీలోని సుర్ ఘాట్, సోనియా విహార్ ప్రాంతాల నుంచి 12 జాతులకు చెందిన మొత్తం 220 మంచినీటి చేపలను సేకరించి విశ్లేషించారు. పరిశోధకులు ఈ చేపల నుంచి మొత్తం 1,678 మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించారు. అంటే ఒక్కో చేపలో సగటున 7.6 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. పరిశీలించిన ఏ ఒక్క చేప కూడా మైక్రోప్లాస్టిక్ కాలుష్యం లేకుండా లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు.
ఢిల్లీ.. కాలుష్య మండలం
పరిశోధన ఫలితాల ప్రకారం.. యమునా నదిలోని ఢిల్లీ ప్రాంతం అత్యధిక మైక్రోప్లాస్టిక్ కాలుష్య మండలంగా గుర్తించబడింది. సోనియా విహార్, సుర్ ఘాట్ ప్రాంతాల నుంచి సేకరించిన చేపల్లో మైక్రోప్లాస్టిక్ స్థాయిలు హర్యానాలోని యమునానగర్, కర్నాల్ ప్రాంతాల చేపలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యత్యాసం గణాంకపరంగానూ ముఖ్యమైనదిగా గుర్తించారు.
కాలుష్యానికి ప్రధాన కారణాలివే
శుద్ధి చేయని మురుగునీరు, మున్సిపల్ వ్యర్థజలాలు, వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వర్షపు నీటితో నదిలోకి చేరే ప్లాస్టిక్ చెత్త, నియంత్రణలేని ప్లాస్టిక్ వ్యర్థాల పారవేత ఢిల్లీలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి ప్రధాన కారణాలని పరిశోధకులు పేర్కొన్నారు. పట్టణీకరణ ప్రభావం, నది పరిసరాల కాలుష్యం చేపల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు పేరుకుపోవడానికి దోహదపడుతున్నాయని తెలిపారు.
తిలాపియా చేపలో అత్యధిక మైక్రోప్లాస్టిక్లు
పరిశీలించిన చేపల జాతుల్లో సోనియా విహార్ ప్రాంతానికి చెందిన తిలాపియా చేపల్లో అత్యధిక కాలుష్యం నమోదైంది. కేవలం 20 చేపల నుంచే 436 మైక్రోప్లాస్టిక్ కణాలు లభించగా, ఒక్కో చేపలో సగటున 21.8 కణాలు ఉన్నట్లు గుర్తించారు. సుర్ ఘాట్ ప్రాంతంలోని తిలాపియాలో 264 కణాలు, సోనియా విహార్కు చెందిన రోహు చేపల్లో 205 కణాలు నమోదయ్యాయి. మరోవైపు కర్నాల్ ప్రాంతంలోని నీడిల్ ఫిష్లో అత్యల్పంగా 37 కణాలు మాత్రమే గుర్తించారు.
తినే భాగాల్లోకీ చేరుతున్న ప్లాస్టిక్ కణాలు
చేపల జీర్ణవ్యవస్థలో అత్యధికంగా 751 మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించగా, మొప్పల్లో 605, కండర కణజాలంలో 322 కణాలు గుర్తించారు. దీని ద్వారా ప్లాస్టిక్ కణాలు చేపల తినదగిన భాగాల్లోకి కూడా చేరుతున్నట్లు స్పష్టమవుతోందని అధ్యయనం పేర్కొంది. ఇది ఆహార భద్రతతో పాటు ప్రజారోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.