తెలుగు రాష్ట్రాలను కారుమబ్బులు కమ్మేశాయి. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు.
సోమవారం ఉదయం/మధ్యాహ్నంలోపు పారాదీప్ – సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయన్నారు. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు వినియోగించడం సురక్షితం కాదని సూచించారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
వాయుగుండం ప్రభావంతో సోమవారం(27-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు,మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా.. అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.




