Headlines

High Court : హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించండి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు! | Telangana High Court Directs CS to Remove AV Ranganath as HYDRA Chief

High Court : హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించండి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు! | Telangana High Court Directs CS to Remove AV Ranganath as HYDRA Chief


హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను వెంటనే తొలగించాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. ఆయన 63 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన హైడ్రా వ్యవస్థ ప్రస్తుతం న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆక్రమణదారులకు చెక్ చెబుతుందని భావించిన ఈ సంస్థ.. ఇటీవల కొన్ని చర్యల వల్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను విస్మరించి ముందుకు వెళ్తున్నారంటూ న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు, అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్‌ను అరెస్టు చేయిస్తాం అని హెచ్చరించడం కలకలం రేపింది.

ఈ వివాదాలకు ప్రధాన కారణం హైడ్రా కమిషనర్ రంగనాథ్ , సిబ్బంది అనుసరిస్తున్న శైలేనని బాధితులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, నోటీసులు ఇవ్వకుండా లేదా సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ప్రైవేటు ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ పరిధి దాటి ప్రవర్తిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా చట్టం ముందు నిలబెడతామని న్యాయమూర్తి స్పష్టం చేయడం, పరిపాలనా యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరికగా మారింది. చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకుండా చేసే ఏ చర్యైనా రాజ్యాంగ విరుద్ధమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు, చట్టపరమైన పరిమితులను దాటి ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం బలపడితే అది ప్రభుత్వ గ్రాఫ్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తలెత్తిన ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే హైడ్రా అధికారులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం సమర్థనీయమే అయినప్పటికీ, ప్రతి చర్యకూ చట్టబద్ధత, ముందస్తు నోటీసులు, రెవెన్యూ, మున్సిపల్ పరిధుల స్పష్టత తప్పనిసరి. న్యాయస్థానాల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతతో వ్యవహరించినప్పుడు మాత్రమే హైడ్రా వ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడుకోగలదు. లేనిపక్షంలో రాజకీయ వేధింపుల సాధనంగా, చట్టాన్ని అతిక్రమించే వ్యవస్థగా ముద్రపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *